న్యూఢిల్లీ: విమానం గాల్లో ఎగురుతుండగా ఒక ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. అయితే ఫ్లైట్ సిబ్బంది సమయస్ఫూర్తిగా స్పందించడంతోపాటు ఆ విమానంలో ఒక డాక్టర్ ప్రయాణిస్తుండటంతో ఆ వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది. మే 8న వాడియా గ్రూప్కు చెందిన గో ఫస్ట్ విమానంలో యూనస్ ర్యాన్రోత్ అనే ప్రయాణికుడు కన్నూర్ నుంచి దుబాయ్కు ప్రయాణిస్తున్నాడు. ఆ విమానం మార్గమధ్యలో గాల్లో ఉండగా అతడికి గుండెపోటు వచ్చింది. దీంతో సహాయం కోసం కేకలు వేశాడు. కేబిన్ సిబ్బంది వెంటనే స్పందించారు. అతడి వద్దకు వచ్చి చూడగా అచేతనంగా పడి ఉన్నాడు. పల్స్ లేకపోగా శ్వాస కూడా ఆడటం లేదు. సిబ్బంది వెంటనే ఆయనను ఒక చోట పడుకోబెట్టారు. సీపీఆర్ ప్రక్రియను చేపట్టారు.
మరోవైపు అదృష్టవశాత్తూ ఆ విమానంలో డాక్టర్ షబర్ అహ్మద్ ప్రయాణిస్తున్నారు. గుండెపోటు వచ్చిన యూనస్ ర్యాన్రోత్ను కాపాడేందుకు ఆయన కూడా ప్రయత్నించారు. ఏఈడీ ద్వారా రెండు షాకులు ఇచ్చిన తర్వాత సీపీఆర్ పద్ధతిని పాటించారు. క్రూ సిబ్బందితో కలిసి ఆ డాక్టర్ ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. గుండె కొట్టుకోవడం ప్రారంభించిన తర్వాత తెలివిలోకి వచ్చిన ఆయనను విమానంలోని ఆక్సిజన్ వ్యవస్థపై ఉంచారు. యూనస్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు కాక్పిట్లోని సిబ్బందికి తెలియజేశారు.
చివరకు ఆ విమానం దుబాయ్లో ల్యాండ్ కాగానే యూనస్ను వీల్ చైర్లో కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. విమానంలో గుండెపోటు వచ్చిన యూనస్తోపాటు ఆయనను కాపాడిన డాక్టర్ షబర్ అహ్మద్కు దేశంలో లేదా విదేశాల్లో ప్రయాణించేందుకు కాంప్లిమెంటరీగా ఉచిత టికెట్ను ఆ సంస్థ ఆఫర్ చేసింది. అలాగే ఆ ప్రయాణికుడిని కాపాడటంలో సహకరించిన విమాన సిబ్బందికి కూడా నగదు అవార్డును గో ఫస్ట్ విమాన సంస్థ యాజమాన్యం అందజేసింది.
'The prompt action by the cabin crew & doctor on flight G8-057 helped save the life of the passenger'.
On May 8th, 2022, a passenger suffered a cardiac arrest while travelling from #Kannur to #Dubai & needed immediate medical attention. pic.twitter.com/T2YvuFRfqt
— GO FIRST (@GoFirstairways) May 27, 2022