న్యూఢిల్లీ, మార్చి 23: సీబీఐ హోదా, దాని అధికారాలు, విధులను నిర్వచించేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. సీబీఐ తమ రాష్ట్రంలో అడుగుపెట్టకుండా చాలా రాష్ర్టాలు జనరల్ కన్సెంట్ను ఉపసంహరించుకున్నాయని గుర్తుచేసింది.
దీంతో పలు కేసుల్లో దర్యాప్తునకు తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయని తెలిపింది. కాబట్టి సీబీఐ హోదా ఏమిటి? దాని అధికారాలు, విధులు ఏమిటి? అన్న దానిపై పూర్తి స్పష్టతనిచ్చేలా ఒక చట్టాన్ని తీసుకురావాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించింది. అలాగే సీబీఐలో సమయానికి కొత్త నియామకాలు జరుగడం లేదని, ఇది కూడా దర్యాప్తుపై ప్రభావం చూపుతున్నదని కమిటీ తెలిపింది. ఇప్పటికైనా నియామకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరింది.