Parliament security Breach | పార్లమెంట్లో బుధవారం భద్రతా వైఫల్యం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన కొత్త పార్లమెంట్లో భద్రతపై పలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసుల వర్గాలు పేర్కొన్నాయి. ఘటనలో ఇప్పటికే నలుగురిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. సాగర్ శర్మ, డీ మనోరంజన్ అనే వ్యక్తులు లోక్సభలోకి కలర్ స్మోక్ను వదిలారు. అలాగే, నీలందేవి, అమోల్ షిండే పార్లమెంట్ వెలుపల ఎరువు, పసుపు కలర్ స్మోక్ను వదిలారు. వీరు నలుగురే కాకుండా లలిత్ ఝాతో పాటు మరో వ్యక్తి ఈ ఘటనలో పాల్గొన్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. లలిత్ ఝాతో పాటు మరో వ్యక్తి పరారీలో ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
లోక్సభలో కలర్ స్మోక్ను వదిలిన ఇద్దరిలో సాగర్ శర్మది ఉత్తరప్రదేశ్లోని లక్నో నివాసి కాగా.. డీ మనోరంజన్ కర్నాటక మైసూర్ నివాసిగా ప్రాథమిక విచారణలో తేలింది. ఇక అమోల్ షిండేది మహారాష్ట్రలోని లాతూర్ కాగా.. నీలం దేవి హర్యానాలోని హిసార్ నివాసి. సాగర్ శర్మ, మనోరంజన్ ఇద్దరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ కార్యాలయం నుంచి ఎంట్రీ పాసులను తీసుకున్న విషయం తెలిసిందే. అధికార పార్టీకి చెందిన మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ మాట్లాడుతూ తన కార్యాలయం నుంచి పాస్ల వివరణ ఇచ్చేందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాలను కలువనున్నట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటనలో పాల్గొన్న ఆరుగురు వ్యక్తులు ఆన్లైన్లో కలుసుకున్నారని.. ఆ తర్వాత ఈ ప్లాన్ను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు వర్గాలు తెలిపాయి. సాగర్ శర్మ, డీ మనోరంజన్ ఆధార్కార్డులతో సహా మరికొన్ని వివరాలను పోలీసులు విడుదల చేశారు. నీలందేవి (42) ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ సివిల్ సర్వీసెస్కు ప్రిపేరవుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
కేంద్రం తీసుకువచ్చిన మూడు చట్టాలకు వ్యతిరేకంగా 2020లో జరిగిన రైతుల ఆందోళనలో నీలం పాల్గొన్నట్లు ఆమె సోదరుడు తెలిపాడు. అయితే, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పాడు. సరిగ్గా 22 సంవత్సరాల కిందట ఇదే రోజున పార్లమెంట్పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ చేదు ఘటన జరిగే రోజు మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. ఇదిలా ఉండగా.. పార్లమెంట్ పునాదులను కదిలించేలా దాడికి దిగుతానని ఖలిస్తాని ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారీ భద్రతా వైఫల్యం బయటపడడం మరోసారి దేశవ్యాప్తంగా అందరినీ షాక్కు గురి చేసింది.
లోక్సభలో బుధవారం మధ్యాహ్నం జీరో అవర్ జరుగుతున్న సమయంలో సందర్శకుల గ్యాలరీ నుంచి సాగర్ శర్మ సభలోకి ప్రవేశించారు. సాగర్ శర్మ పసుపు కలర్ స్మోగ్ క్యాన్ను పట్టుకొని ఎంపీ టేబుల్పై నుంచి లోక్సభ స్పీకర్ కుర్చీ వద్దకు చేరుకునే ప్రయత్నించాడు. అయితే, ఎంపీలు అతన్ని అడ్డుకున్నారు. అతనితో వచ్చిన మనోరంజన్ గ్యాలరీలోనే ఉండిపోయాడు. కొద్దిసేపటికి పార్లమెంట్ వెలుపల నీలందేవి, అమోల్ షిండే పసుపు, ఎరువు స్మోగ్ను వదిలారు. అనంతరం నినాదాలు చేశారు. ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన యాంటీ టెర్రర్ సెల్ నలుగురిని అరెస్టు చేసి విచారిస్తున్నది. అయితే, ఘటన నేపథ్యంలో భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో ఎంపీలకు స్పీకర్ ఓం బిర్లా భరోసా ఇచ్చారు. సమగ్ర విచారణ జరుగుతుందని, అందరిని పట్టుకోవడంతో పాటు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత సభ గురువారం ఉదయం 11 గంటలకు వాయిదాపడింది.