Parliament Security Breach | పార్లమెంట్ భద్రతా లోపం వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉపా (UAPA) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లోక్సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి నిందితులు మనోరంజన్, సాగర్ శర్మ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో ఒకరు బెంచీలపైకి ఎక్కి ‘నిరంకుశత్వం నశించాలి’ అని నినదించారు. ఈ ఘటనతో పార్లమెంట్ భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిందితులు లోక్సభ ప్రేక్షకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకి రంగు పొగను వదలడంతో ఎంపీలు ఆందోళనకు గురయ్యారు.
పలువురు వేగంగా స్పందించి నిందితుల్లో ఒకరిని పట్టుకొని చితకబాది మార్షల్స్కు అప్పగించారు. మరో వైపు నీలందేవి, అమోల్ షిండే పార్లమెంట్ భవనం వెలుపల సైతం పసుపు, ఎరుపు రంగు పొగను వదులుతూ నినాదాలు చేశారు. అనంతరం భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కుట్రలో లలిత్, విశాల్ శర్మ అనే మరో ఇద్దరు నిందితులు సైతం భాగమయ్యారని పోలీసు వర్గాలు తెలిపాయి. హర్యానాలోని గురుగ్రామ్లో విశాల్ను అదుపులోకి తీసుకోగా.. లలిత్ పరారీలో ఉన్నాడు. ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తున్నానని చెప్పి షిండే మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలోని తన గ్రామం నుంచి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
హర్యానాకు చెందిన నీలందేవితో కలిసి పార్లమెంట్ వెలుపల ‘నియంతృత్వం పనిచేయదు’.. భారత్ మాతా కీ జై’, జై భీమ్.. జై భారత్’ అంటూ నినదించారు. ఆరుగురు వ్యక్తులు కలిసి సోషల్ మీడియా ద్వారా ఒకరితో ఒకరు టచ్లో ఉన్నారని.. ఇది ప్రణాళికాబద్ధంగా జరిగిన కుట్ర అని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. నిందితులు రెండురోజుల కిందట ప్లాన్ చేశారని.. బుధవారం పార్లమెంట్లోకి చేరుకోక ముందు రెక్కీ నిర్వహించారన్నారు. ఆరుగురిలో ఐదుగురు పార్లమెంట్కు రాక ముందు గురుగ్రామ్లోని విశాల్ నివాసంలో బస చేశారని తెలిపాయి. పథకం ప్రకారం ఆరుగురు పార్లమెంట్ లోపలికి వెళ్లాలనుకున్నా ఇద్దరికి మాత్రమే పాస్లు వచ్చాయని పోలీసు వర్గాలు వివరించాయి.