న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్స్ పరీక్షల ప్రక్రియ ముగియడానికి 15 నెలలు దాటుతున్నదని, దీంతో అభ్యర్థుల విలువైన కాలం వృథా అవుతున్నదని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. సుదీర్ఘకాలం సాగుతున్న ఎంపిక ప్రక్రియ అభ్యర్థుల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని, కాల వ్యవధిని వీలైనంత మేరకు తగ్గించాలని యూపీఎస్సీని పార్లమెంట్ కమిటీ కోరింది.
2022-23లో 32.19 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, కేవలం 16.82 లక్షల (51.95శాతం) మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారని, అభ్యర్థుల హాజరు తక్కువ ఉండటానికి కారణం సుదీర్ఘకాలం పాటు సాగిన ఎంపిక ప్రక్రియేనని కమిటీ నివేదిక పేర్కొంది. ప్రస్తుత సివిల్స్ ఎంపిక విధానం ఇంగ్లిష్, నాన్-ఇంగ్లిష్ అభ్యర్థులకు సమాన అవకాశం కల్పిస్తుందా? లేదా? అన్నది అంచనా వేయడానికి నిపుణుల కమిటీ ఏర్పాటుచేయాలని సూచించింది. ప్రిలిమినరీ పరీక్షల కీ విడుదల చేయాలని, వాటిపై అభ్యర్థుల ఫిర్యాదులు స్వీకరించాలని సూచించింది. ఉద్యోగ నియామక ప్రకియ పూర్తికి ఆరు నెలలకు మించి సమయం తీసుకోరాదని సూచించింది.