న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రెండు రోజుల ముందే ముగిశాయి. రాజ్యసభ కూడా బుధవారం సాయంత్రం నిరవధికంగా వాయిదా పడింది. జూలై 19న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్ట్13 వరకు జరుగాల్సి ఉన్నది. అయితే ప్రతిపక్షాలు అడ్డుకోవడంతో ఉభయ సభలు సరిగా జరుగడం లేదు. పెగాసస్ వివాదం, రైతుల నిరసనలు, ఇతర సమస్యలపై చర్చ కోసం పట్టుబడుతూ, బిల్లుల ప్రవేశాన్ని అడ్డుకుంటూ సభలో గందరగోళం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం లోక్సభ నిరవధిక వాయిదా పడగా, సాయంత్రం రాజ్యసభ కూడా నిరవధికంగా వాయిదా పడింది. దీంతో షెడ్యూల్ కన్నా రెండు రోజుల ముందుగానే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి.
కాగా, ఈసారి లోక్సభా కార్యక్రమాలను అనుకున్నట్లు సాగలేదని, కేవలం 22 శాతం మాత్రమే ప్రొడక్టివిటీ రికార్డు అయ్యిందని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. మొత్తం 74 గంటల 46 నిమిషాల పాటు లోక్సభ జరిగినట్లు చెప్పారు. 20 బిల్లులు పాసయ్యాయని, ఓబీసీ బిల్లుకు అన్ని పార్టీల సభ్యులు సహకరించారని వెల్లడించారు.
మరోవైపు వర్షాకాల సెషన్లో రాజ్యసభ 28 శాతం ప్రొడక్టివిటీని నమోదు చేసింది. సభలో మొత్తం 17 సమావేశాలు, 28 గంటల 21 నిమిషాల పాటు జరిగాయి. అంతరాయాల కారణంగా 76 గంటల 26 నిమిషాలు వృథా అయ్యాయి. 19 బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందాయి.