న్యూఢిల్లీ : దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. వేగంగా కేసులు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలూ జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో సానిటేషన్ పనులు, ఇతర ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పనులు సాగుతున్న తీరును లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే బడ్జెట్ సమావేశాలకు పార్లమెంట్లో సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఎంపీలు, సిబ్బంది అంతా సురక్షితంగా ఉంటారని, సమావేశాలు మెరుగ్గా సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారిపై సమీక్ష నిర్వహించి, సురక్షితంగా సభలను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ఉభయ సభల ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు.