Parliament Budget Session | న్యూఢిల్లీ, జనవరి 17: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండు విడతల్లో జరగనున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఆమె బడ్జెట్ను సమర్పించడం ఇది వరుసగా ఎనిమిదోసారి.
సంప్రదాయం ప్రకారం జనవరి 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ప్రభుత్వం ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెడుతుంది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు.
బడ్జెట్ తర్వాత ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ తీర్మానంపై ప్రధాని సమాధానంతో మొదటి విడత బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 13న ముగియనున్నాయి. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి.