హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ)/న్యూఢిల్లీ: అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ సహా ఇతర విపక్ష ఎంపీల ఆందోళనలు మంగళవారం కూడా పార్లమెంట్ ఉభయసభల్లో కొనసాగాయి. అదానీ సంగతి తేల్చాల్సిందేనని, ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందేనని సభ్యులు పట్టుబట్టారు. అదానీ గ్రూపు అక్రమాలపై హిండెన్బర్గ్ నివేదిక తేల్చిన అంశాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేయాల్సిందేనని ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ‘మోదీ-అదానీ భాయ్ భాయ్’ అంటూ పెద్దయెత్తున నినాదాలు చేశారు. ఎంపీలు లోక్సభ, రాజ్యసభల వెల్లోకి దూసుకొచ్చి ఆందోళన చేశారు. ‘సేవ్ డెమోక్రసీ’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక, నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు నల్ల అంగీలు ధరించి నిరసన తెలిపారు. పలువురు కాంగ్రెస్ సభ్యులు లోక్సభలో స్పీకర్ చైర్ వైపుగా పేపర్లు, నల్ల కండువాలు విసిరారు. రాహుల్పై అనర్హత వేటును ఎంపీలు తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఉభయసభలు బుధవారానికి వాయిదా పడ్డాయి.
కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా పలు విపక్ష ఎంపీలు మంగళవారం రాత్రి ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నుంచి టౌన్ హాల్ వరకు నిర్వహించ తలపెట్టిన ‘సేవ్ డెమోక్రసీ’ ర్యాలీని పోలీసులు అడ్డుకొన్నారు. పెద్దయెత్తున భద్రతా సిబ్బందిని మోహరించడంతో పాటు భారీ సంఖ్యలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. మార్చ్లో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీలను అడ్డుకొన్న పోలీసులు.. వారిని ఎర్రకోట వద్దకు పోనివ్వకుండా ఆపేశారు. అడ్డుకొన్న చోటు నుంచే ర్యాలీ చేపట్టేందుకు ఎంపీలు ప్రయత్నించగా.. 144 సెక్షన్ అమల్లో ఉన్నదని పేర్కొంటూ ముందుకు పోనివ్వలేదు. అనంతరం పలువురు ఎంపీలు, నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. పోలీసు వాహనాల్లో వేరే చోటుకి తరలించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, కేంద్రం ఆధ్వర్యంలోని ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా ఎంపీలు నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్టు చేస్తూ ‘నియంత భయం చూడండి’ అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ‘అదానీ అంశాన్ని లేవనెత్తితే పార్లమెంట్ను వాయిదా వేస్తారు.. రోడ్లపై ఆందోళనకు దిగితే పోలీసులను పంపిస్తారు’ అని విమర్శించింది.
ఎర్రకోట వద్ద విపక్షాల ర్యాలీని అడ్డుకోవడంపై బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది. అప్రజాస్వామికంగా, నిరంకుశంగా వ్యవహరిస్తున్న కేంద్రంలోని బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన ర్యాలీ చేస్తుంటే అడ్డుకుంటున్నారని లోక్సభలో బీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీరు మారకుంటే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అన్ని వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకొన్న కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి బీజేపీ తూట్లు పొడుస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు లొంగని, బీజేపీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే, విమర్శించే పార్టీలు, నేతలపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదని అన్నారు. ప్రజలు సమస్యలను పక్కదారి పట్టించడానికి బీజేపీ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. పార్లమెంట్ నడవకుండా వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నదని ఆక్షేపించారు. ర్యాలీలో బీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు, బీబీ పాటిల్, కేఆర్ సురేశ్ రెడ్డి, లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.