న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దేశ వ్యాప్తంగా రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు సుప్రీంకోర్టు సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. వీటిలో జాతీయ రహదారులపైన భారీ వాహనాల పార్కింగ్ నిషేధం, రోడ్డు పక్కన అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు వంటివి ఉన్నాయి. నివారించగ్గ రోడ్డు ప్రమాద మరణాలు జీవించే హక్కును ఉల్లంఘిస్తాయని కోర్టు స్పష్టం చేసింది.
నిర్దిష్ట కాలపరిమితి లోగా చర్యలు తీసుకోవాలని అధికారులను సుప్రీంకోర్టు శనివారం ఆదేశించింది. దేశంలోని మొత్తం రోడ్ల పొడవులో కేవలం 2 శాతం మాత్రమే ఉన్న నేషనల్ హైవేలు అన్ని రోడ్డు మరణాల్లో మాత్రం దాదాపు 30 శాతానికి కారణమవుతున్నాయని జస్టిస్ జేకే మహిశ్వేరి, జస్టిస్ ఏఎస్ చందూర్కర్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. అక్రమ పార్కింగ్ లేదా బ్లాక్స్పాట్లు వంటి నివారించదగిన ప్రమాదాల కారణంగా ఒక్క ప్రాణం పోయినా అది ప్రభుత్వ రక్షణ ఛత్రం విఫలమైనట్టేనని కోర్టు స్పష్టం చేసింది.
ఈ మేరకు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ, జాతీయ రహదారుల సంస్థ, రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్హెచ్ఏఐ, రాష్ట్ర పోలీసులు, రవాణా శాఖల అధికారులు 60 రోజుల్లోగా ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. నేషనల్ హైవేలకు చెందిన రైట్ ఆఫ్ వే(ఆర్వోడబ్ల్యూ) పరిధిలో కొత్త వాణిజ్య నిర్మాణాల నిర్మాణం లేదా కార్యకలాపాలను కూడా కోర్టు నిషేధించింది.