పట్నా : తప్పిపోయిన కొడుకు మరణించాడని భావించిన తల్లితండ్రులు కర్మకాండలు నిర్వహించగా ఏడేండ్ల తర్వాత అతడు ఇంటికి తిరిగివచ్చిన ఘటన బిహార్లో వెలుగుచూసింది. పట్నాకు సమీపంలోని గ్రామానికి చెందిన బిహారి రాయ్ ఏడేండ్ల కిందట అదృశ్యమయ్యాడు. అప్పటినుంచి తమ కొడుకు కోసం తల్లితండ్రులు పలు ప్రాంతాల్లో గాలించినా ఫలించలేదు.
దీంతో తమ కొడుకు మరణించాడని వారు భావించారు. ఓ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చేరిన బిహారి రాయ్ను ఓ సంస్ధ అక్కున చేర్చుకుంది. ఆ సంస్ధ సభ్యులతోనే రాయ్ పెరిగి పెద్దయ్యాడు. ఆపై రాయ్ అందించిన వివరాలతో గ్రామ సర్పంచ్ను సదరు సంస్ధ సంప్రదించింది. బిహార్ రాయ్ తల్లితండ్రులను కలిసిన సర్పంచ్ వారి కుమారుడు ఢిల్లీలో ఉన్నాడని చెప్పి తల్లితండ్రులతో కొడుకును కలిపాడు.
గ్రామ సర్పంచ్ చొరవ తీసుకుని బిహారీ రాయ్ను తన కన్నవారి చెంతకు చేర్చాడు. రాయ్ తప్పిపోయే సమయంలో అతడికి 30 ఏండ్ల వయసు ఉంటుందని, అప్పటికే అతడి భార్య చనిపోయిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఇక కుమారుడు కనిపించకపోవడంతో వారు మాంత్రికుడిని సంప్రదించగా మీ కొడుకు చనిపోయాడని చెబుతూ కర్మకాండలు జరపించాడు. చనిపోయాడనుకున్న కుమారుడు తిరిగి రావడంతో కుటుంబసభ్యులు సంతోషించారు.
Read More :
Monu Manesar: ఎవరీ మోనూ మనేసర్? హర్యానా హింసతో అతనికి లింకేంటి?