న్యూఢిల్లీ: హర్యానాలోని నుహ్ జిల్లాలో సోమవారం జరిగిన ఘర్షణలకు మోనూ మనేసర్(Monu Manesar) కారణమని తెలుస్తోంది. భజరంగ్ దళ్కు చెందిన అతను.. ఊరేగింపుకు వస్తున్నట్లు తెలియడంతోనే వివాదం చెలరేగినట్లు భావిస్తున్నారు. ఇద్దరు ముస్లిం యువకుల హత్య కేసులో మోనూ మనేసర్ కీలక నిందితుడిగా ఉన్నారు. సోమవారం వీహెచ్పీ నిర్వహించిన ఊరేగింపులో అతను పాల్గొననున్నట్లు తెలిసింది. దీంతో మరో వర్గం వారు ఆ ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొన్నది. భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది. నలుగురు వ్యక్తులు కూడా మరణించారు. గురుగ్రామంలో రాత్రికి రాత్రే ఓ మసీదును కాల్చిన ఘటన కూడా చోటుచేసుకున్నది.
నుహ్ ఊరేగింపుకు రానున్నట్లు మోనూ మనేసర్ కొన్ని రోజుల క్రితం ఓ వీడియోను పోస్టు చేశారు. భారీ సంఖ్యలో ఆ ఊరేగింపుకు జనం హాజరుకావాలని తన వీడియో సందేశంలో మద్దతుదారుల్ని కోరాడు. అయితే సోషల్ మీడియాలో వార్నింగ్ రావడంతో అతను ఆ ర్యాలీకి వెళ్లలేదని తెలిసింది. విశ్వ హిందూ పరిషత్ ఇచ్చిన సలహా మేరకు ఆ ర్యాలీకి వెళ్లలేదని మోనూ మనేసర్ తెలిపాడు.
మోనూ మనేసర్ వయసు 30 ఏళ్లు. రాజస్థాన్లోని బివానిలో ఇద్దరు ముస్లిం యువకుల్ని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటనలో నిందితుడు. ఫిబ్రవరిలో ఈ ఘటన జరిగింది. కారులోనే ఆ యువకుల్ని దగ్దం చేశారు. జునైద్, నాసిర్లు ఆవులను తరలిస్తున్నట్లు అనుమానం రావడంతో వాళ్లపై మనేసర్ అటాక్ చేశారు. కానీ ఆ క్రైమ్తో తమకు సంబంధం లేదని భజరంగ్ దళ్ చెబుతోంది.
పలు మార్లు మనేసర్ను పట్టుకునేందుకు రాజస్థాన్ పోలీసులు ప్రయత్నం చేశారు. కానీ అతను సమాచారం లీక్ కావడంతో పరారీ అయినట్లు తెలుస్తోంది. మోనూ మనేసర్ అసలు పేరు మోహిత్ యాదవ్. మీవాట్లో అతను ఆవుల సంరక్షణ దళాన్ని నడిపిస్తున్నాడు. ఆవుల అక్రమ తరలింపుపై అనేక వీడియోలను అతను పోస్టు చేశాడు. లవ్ జిహాద్కు వ్యతిరేకంగా కూడా అతను ప్రచారం చేశాడు.
హర్యానా ప్రభుత్వం 2015లో ఆవుల సంరక్షణ చట్టాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే చట్టం కింద ఏర్పడిన జిల్లా టాస్క్ ఫోర్స్లో అతను సభ్యుడిగా ఉన్నాడు. యూట్యూబ్, ఫేస్బుక్లో మనేసర్కు వేల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.