Madras High Court | చెన్నై, సెప్టెంబరు 10 (నమస్తే తెలంగాణ): ఇచ్చిన మాట తప్పి, తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసే పిల్లలకు మద్రాస్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. తల్లిదండ్రులు ఆస్తులను రాసిచ్చిన తర్వాత పిల్లలు తమను పట్టించుకోకపోతే ఆ ఆస్తులను తిరిగి తీసుకోవచ్చునని సంచలన తీర్పు వెలువరించింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు రాసే సెటిల్మెంట్ దస్తావేజులో ప్రేమ, ఆత్మీయతలతో ఆస్తిని ఇస్తున్నట్లు పేర్కొంటే, ఆ పిల్లలు తమకు హామీ ఇచ్చిన విధంగా తమ సంరక్షణ బాధ్యతలను నెరవేర్చకపోతే, ఆ ఆస్తిని ఏకపక్షంగా తిరిగి ఆ తల్లిదండ్రులు తీసుకోవచ్చునని హైకోర్టు తెలిపింది. జస్టిస్ ఎస్ ఎం సుబ్రహ్మణ్యం ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.
ఉదాసీనంగా వ్యవహరిస్తే..
పిల్లల ప్రయోజనం కోసం కేవలం ప్రేమ, ఆత్మీయతలతో ఆస్తిని ఇస్తున్నట్లు సెటిల్మెంట్ దస్తావేజులో పేర్కొంటే చాలునని, ఈ విధంగా పేర్కొనడమే తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టంలోని నిబంధనలను సంతృప్తిపరుస్తుందని జస్టిస్ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. గిఫ్ట్ డీడ్ను లేదా సెటిల్మెంట్ దస్తావేజును రాయడానికి ప్రతిఫలం ప్రేమ, ఆత్మీయతలేనని; ఇవి భావిత ప్రతిఫలం అవుతాయని తెలిపారు. ఈ ప్రతిఫలాన్ని ఇవ్వడంలో ఉల్లంఘనలు జరిగితే ఈ చట్టం ప్రకారం చర్యలు చేపట్టడానికి తగిన కారణం అవుతుందని వివరించారు. ప్రస్తుత కేసులో సబ్ రిజిస్ట్రార్ జారీ చేసిన ఆదేశాల్లో ఎటువంటి లోపం లేదని స్పష్టం చేశారు. వృద్ధ తల్లిదండ్రుల పట్ల మానవీయ ప్రవర్తనను పరిశీలించడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యమని తెలిపారు. వృద్ధులు లేదా తల్లిదండ్రుల పట్ల ఉదాసీనతను ప్రదర్శించినపుడు, వారికి భద్రత కల్పించనపుడు, వారి గౌరవాన్ని కాపాడనపుడు, ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చునన్నారు. తిరుప్పూర్ సబ్ రిజిస్ట్రార్ ఓ సెటిల్మెంట్ డీడ్ను రద్దు చేస్తూ ఇచ్చిన ఆదేశాలను సమర్థిస్తూ హైకోర్టు ఈ తీర్పు చెప్పింది.
ఇదీ కేసు నేపథ్యం..
షకీరా బేగం తన కుమారుడు మహమ్మద్ దయాన్ పేరు మీద కొంత ఆస్తిని రాశారు. అయితే కుమారుడు తన బాగోగులను పట్టించుకోకపోవడంతో ఆమె తిరుప్పూర్ సబ్ రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేశారు. తాను రాసిన సెటిల్మెంట్ డీడ్ను రద్దు చేయాలని కోరారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ ఈ డీడ్ను రద్దు చేశారు. దీన్ని మహమ్మద్ దయాన్ సవాల్ చేశారు. తన తల్లి 2020 అక్టోబరు 20న సెటిల్మెంట్ డీడ్ను ఎటువంటి షరతులు లేకుండా రాశారని తెలిపారు. . దయాన్ వాదనలను జస్టిస్ సుబ్రహ్మణ్యం తోసిపుచ్చారు. బాధిత తల్లిదండ్రులు లేదా వృద్ధులు ఈ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చునని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది.