Jammu and Kashmir : దాయాది దేశం పాకిస్తాన్.. భారత సరిహద్దులో కాల్పులకు పాల్పడింది. మంగళవారం రాత్రి పాక్ దళాలు.. భారత సరిహద్దుపైకి రెండు రౌండ్ల కాల్పులు జరిపాయి. వెంటనే అప్రమత్తమైన భారత దళాలు కూడా ఎదురు కాల్పులకు దిగడంతో పాక్ తోక ముడిచింది. ఈ ఘటన కాశ్మీర్ ప్రాంతం, కుప్వారా జిల్లా, కేరన్ సెక్టార్లో జరిగింది.
ఈ సరిహద్దు ప్రాంతంలో భద్రతను మరింత పెంచేందుకు 6 రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన సిబ్బంది రాత్రిపూట హై టెక్నాలజీ సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేస్తున్నారు. శత్రువులు చొచ్చుకొచ్చే వీలున్న కొన్ని బ్లైండ్ స్పాట్స్ లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి సామగ్రి తరలించి, వాటిని అమరుస్తుండగా పాక్ సైన్యం తేలికపాటి ఆయుధాలతో రెండు రౌండ్ల కాల్పులు జరిపింది. సీసీ కెమెరాలు అమర్చే పనుల్ని అడ్డుకునే ఉద్దేశంతో పాక్ ఈ పని చేసినట్లు తెలుస్తోంది. అయితే, వెంటనే భారత భద్రతా బలగాలు ధీటుగా స్పందించాయి. పాక్ వైపు సింగిల్ షాట్స్ కాల్పులకు దిగింది మన సైన్యం. దీంతో పాకిస్తాన్ ఆర్మీ ఆగిపోయింది.
కాగా.. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ కలగలేదని రక్షణ అధికారులు తెలిపారు. మరోవైపు ఇది చాలా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో సైన్యం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేస్తోంది ఇండియన్ ఆర్మీ. మన సైన్యం దృష్టి మళ్లించేందుకే పాక్ ఈ కాల్పులు జరిపిందా అనే అనుమానంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ ప్రాంతాన్ని సైన్యం పూర్తిగా గాలిస్తోంది. పైగా.. రాబోయే రిపబ్లిక్ డేను దృష్టిలో ఉంచుకుని భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.