న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని స్కూల్ కార్యకలాపాలను పాకిస్థాన్ హైకమిషన్ నిలిపివేసింది. (Pakistan mission school) విద్యార్థుల నమోదు తక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో పని చేసే ఆ దేశ అధికారులు, సిబ్బంది పిల్లల చదువు కోసం ఒక స్కూల్ను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. అయితే ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్లో సిబ్బంది సంఖ్యను పాకిస్థాన్ సగానికి తగ్గించింది. 2020లో భారత్ కోరడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాకిస్థాన్ హైకమిషన్ ఢిల్లీలో నిర్వహించే ఈ స్కూల్లో ఆ దేశానికి చెందిన పిల్లలు తగినంతగా లేరు. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తి కావడంతో ఈ స్కూల్ కార్యకలాపాలను పాకిస్థాన్ హైకమిషన్ తాత్కాలికంగా నిలిపివేసింది.
కాగా, పాకిస్థాన్ రాయబార కార్యాలయ ప్రతినిధి ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. ఈ స్కూల్ను కేవలం పాక్ హైకమిషన్ అధికారులు, సిబ్బంది పిల్లల కోసమే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2020లో భారత్ డిమాండ్ మేరకు పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో సిబ్బందిని సగానికి తగ్గించినట్లు వెల్లడించారు. దీంతో పాక్ హైకమిషన్ అధికారులు, సిబ్బంది పిల్లలు తగినంతగా లేరని అన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఈ స్కూల్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించారు.