Asaduddin Owaisi | హైదరాబాద్, మే 17: ఉగ్రవాదాన్ని పెంచి పోషించే సుదీర్ఘ చరిత్ర కలిగిన పాకిస్థాన్ మానవాళికే ముప్పుగా మారిందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ప్రపంచ దేశాలకు కేంద్ర ప్రభుత్వం పంపుతున్న అఖిల పక్ష ప్రతినిధి బృందాల సభ్యుడిగా అంతర్జాతీయ సమాజానికి తాను ఇచ్చే సందేశ సారాంశం ఇదేనని శనివారం పీటీఐ వీడియోస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒవైసీ వెల్లడించారు. పాకిస్థాన్ ప్రాయోజిత ఉగ్రవాదులు ఎంతోకాలంగా అమాయక ప్రజలపై సాగిస్తున్న దారుణ మారణకాండ గురించి ప్రపంచానికి వివరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
‘పాకిస్థాన్ ప్రాయోజిత ఉగ్రవాదానికి భారత్ అతిపెద్ద బాధితురాలు. భారత్ని అస్థిరపరచాలన్నదే పాకిస్థాన్ ప్రభుత్వం, ఐఎస్ఐ, పాక్ ఆర్మీ లక్ష్యంగా ఉన్నంత వరకు ఆ దేశాన్ని మనం ఎన్నటికీ నమ్మలేం’ అని ఆయన నిర్దంద్వంగా స్పష్టం చేశారు. బీజేపీని తీవ్రంగా విమర్శించే ప్రతిపక్ష నాయకులలో ఒకరైన ఒవైసీ పాక్పై మోదీ ప్రభుత్వ కఠిన వైఖరిని గట్టిగా సమర్థిస్తున్నారు. ‘రాజకీయంగా మేము(ఎంఐఎం) బీజేపీ సిద్ధాంతాలపై పోరాడుతూనే ఉంటాము. మా మధ్య రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నప్పటికీ దేశం విషయానికి వస్తే..ఈ దేశ ప్రజలను చంపుతుంటే వేరే ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతుంది?’ అని ఒవైసీ ప్రశ్నించారు.
పాకిస్థాన్ పట్ల భారతీయ ముస్లిం సమాజంలో నెలకొన్న మనోభావాలనే తాను వ్యక్తీకరిస్తున్నానని అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. తమ పార్టీ కూడా భారతీయ ముస్లింలు నిర్మించుకున్నదేనని తెలిపారు. భారతీయులంతా ఒకే పడవలో ప్రయాణిస్తున్నారని.. అంతర్గత సమస్యలను వారే పరిష్కరించుకోవాలని అన్నారు. భారత్ను అస్థిరపరచడం, మత పరమైన చీలికలు సృష్టించడం, దేశ ఆర్థికాభివృద్ధిని అడ్డుకోవడం పాకిస్థాన్ పాటించే ‘రాయని సిద్ధాంతం’గా ఆయన అభివర్ణించారు. భారత్లో 20 కోట్ల మంది ముస్లింలు నివసిస్తున్నారని, వారంతా ఇక్కడ సురక్షితంగా ఉన్నారన్న సందేశాన్ని పాక్కు తెలియచేయాల్సి ఉందని ఆయన అన్నారు.
ఉగ్రవాదులకు ఆయుధాలు, శిక్షణ, డబ్బు సమకూర్చి పాకిస్థాన్ మానవాళికే ముప్పుగా మారిందని ఒవైసీ విమర్శించారు. పహల్గాం ఉగ్ర దాడితో భారత్ సహనం నశించిందని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీరులో స్వచ్ఛందంగా వ్యక్తమైన నిరసనలతో ఆ ప్రాంతంలో పాక్ ప్రాయోజిత ఉగ్రవాదానికి ఇక ఏమాత్రం మద్దతు లేదని స్పష్టమైందని ఒవైసీ తెలిపారు. కశ్మీరీలను అక్కున చేర్చుకోవాలి ‘పాకిస్థాన్తో కచ్చితంగా పోరాడాల్సిందే. అలాగే కశ్మీరీలను కూడా అక్కున చేర్చుకోవాలి’ అని ఆయన ప్రధాని మోదీ, అమిత్ షాలకు సూచించారు.
న్యూఢిల్లీ: పాకిస్థాన్ తీరును అంతర్జాతీయంగా ఎండ గట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడు బృందాలను సిద్ధం చేసింది. అధికార, విపక్షాలకు చెందిన ఏడుగురు నేతలు వీటికి నేతృత్వం వహించనున్నారు. ఈ జాబితాను కేంద్రం శనివారం విడుదల చేసింది. శశిథరూర్ (కాంగ్రెస్), రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా (బీజేపీ), సంజయ్ కుమార్ ఝా (జేడీయూ), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలే (ఎన్సీపీ), శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే (శివసేన) నేతృత్వంలోని బృందాలు ఐక్యరాజ్యసమితితోపాటు భారత మిత్ర దేశాల్లో పర్యటించనున్నాయి.
అయితే.. ఈ జాబితాలోకి శశిథరూర్ అనూహ్యంగా ఎంపికయ్యారు. వాస్తవానికి బృందాల్లో సభ్యుల కోసం జాబితా పంపాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్ని పార్టీలను కోరారు. కాంగ్రెస్ నుంచి ఆనంద్ శర్మ, సయ్యద్ నజీర్ హుస్సేన్, రాజా బ్రార్, గౌరవ్ గొగోయ్ పేర్లను పంపారు. కానీ వీటన్నింటినీ పక్కనబెడుతూ కేంద్రం శశిథరూర్ను ఎంపిక చేసింది.