అమృత్సర్: భారత్, పాక్ సరిహద్దుల్లో ఎప్పుడూ ఉద్రిక్త పరిస్థితులు. అనునిత్యం ఇరువైపుల తుపాకులతో సైన్యం పహారా కాస్తుంది. అలాంటిది దాయాది దేశాల సైనికులు స్వీట్లు పంచుకున్నారు. అవునండి.. నిజమే.. భారత్, పాక్ సైనికులు తమ నోళ్లను తీపి చేసుకున్నారు. సందర్భమేంటి అనుకుంటున్నారా.. ఈ రోజు (ఆగస్టు 14) పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పంజాబ్లోని అమృత్సర్ సమీపంలో ఉన్న అట్టారీ-వాఘా సరిహద్దుల్లో పాకిస్థాన్ రేంజర్లు, బీఎస్ఎఫ్ సైనికులు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు.
ఆగస్టు 15న భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో ‘తాము కూడా రేపు వారికి స్వీట్లను బహుమతిగా ఇస్తాం’ అని బీఎస్ఎఫ్ కమాండెంట్ జస్బీర్ సింగ్ అన్నారు. అఖండ భారత్ నుంచి స్వతంత్ర దేశంగా 1947, ఆగస్టు 14న పాకిస్థాన్ విడిపోయిన విషయం తెలిసిందే. దీంతో మనకంటే ఒక్కరోజు ముందే వారు స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నారు.