కేంద్రం నుంచి ఏటా రూ.3 లక్షల నిధులు మంజూరు
పచ్చదనం, పరిశుభ్రత, పనితీరుకు దక్కిన గుర్తింపు
బొంరాస్పేట : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎన్క్వాస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్) సర్టిఫికెట్ లభించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలు, పాటిస్తున్న పరిశుభ్రత, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, సిబ్బంది పనితీరు, పచ్చదనం పెంపు వంటి అంశాల్లో చాలా మెరుగ్గా ఉన్న దవాఖానలకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాతీయ ఆరోగ్య మిషన్ ‘ఎన్క్వాస్’ సర్టిఫికెట్ ఇస్తుంది. దీనికి ఎంపికైన పీహెచ్సీకి కేంద్రం ఏటా రూ.3 లక్షల నిధులను మూడేండ్ల పాటు మంజూరు చేస్తుంది. ఈ నిధుల్లో 75 శాతం దవాఖాన అభివృద్ధికి, మిగతా 25 శాతం సిబ్బందికి ఇన్సెంటివ్ రూపంలో అందజేస్తారు. ఈ ఏడాది జనవరిలో కేంద్ర అధికారుల బృందం ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, వసతి, సౌకర్యాలు, రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించింది.
పీహెచ్సీ పనితీరు బాగుండడంతో కేంద్ర బృందం 84 మార్కులు కేటాయిస్తూ 2020-21 సంవత్సరానికి బొంరాస్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎన్క్వాస్ సర్టిఫికెట్ను జారీ చేసింది. కొవిడ్ దృష్ట్యా వర్చువల్గా నిర్వహించిన సమావేశంలో ఎన్క్వాస్ సర్టిఫికెట్ ఇస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారని, వైరస్ వ్యాప్తి తగ్గిన తరువాత అధికారుల బృందం మరోసారి దవాఖానకు వచ్చి సర్టిఫికెట్ను ప్రదానం చేస్తారని వైద్యాధికారి రవీంద్ర యాదవ్ తెలిపారు. ఇదిలా ఉండగా పీహెచ్సీ 2019-20లో కాయకల్పకు ఎంపికైంది. పీహెచ్సీలో రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుతుండడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయి. రోగులకు నీటి వసతి, పరిసరాలలో పచ్చదనం పెరిగి ఆహ్లాదకరంగా ఉంటుంది. మండల వైద్యాధికారి రవీంద్ర యాదవ్ చొరవతో పీహెచ్సీ కార్పొరేట్ దవాఖానలో సకల సౌకర్యాలు సమకూరాయి. దవాఖానకు వచ్చే రోగులకు సిబ్బంది మెరుగైన వైద్యం అందిస్తున్నది.
గర్వంగా ఉంది : రవీంద్ర యాదవ్, మ ండల వైద్యాధికారి
బొంరాస్పేట పీహెచ్సీకి ఎన్క్వాస్ సర్టిఫికెట్ రావడం గర్వంగా ఉంది. అంకితభావంతో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, దవాఖాన అభివృద్ధికి చేసిన కృషికి ప్రతిఫలంగా దీన్ని భావిస్తున్నాం. ప్రజాప్రతినిధులు, నాయకులు, సిబ్బంది సహకారంతో పీహెచ్సీని కార్పొరేట్ దవాఖానలా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం. రోగులకు మరింత మెరుగైన వైద్యం అందిస్తాం.