కోల్కతా: రైల్వే ప్లాట్ఫారమ్పై వాటర్ ట్యాంక్ కూలింది. (Overhead water tank falls) ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రయాణికుల్లో కొందరు గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు రైల్వే ఉద్యోగులను సస్పెండ్ చేశారు. పశ్చిమ బెంగాల్లోని బర్ధమాన్ రైల్వే స్టేషన్లో ఈ ప్రమాదం జరిగింది. బుధవారం ఆ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫారమ్ 2, 3 మధ్యలో మెటల్ ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా కూలింది. ఆ సమయంలో అక్కడ ఉన్న పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. మిగతా ప్రయాణికులు భయాందోళన చెందారు.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే ఆర్పీఎఫ్, రైల్వే పోలీసులు స్పందించారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు రైల్వే ఉద్యోగులను అధికారులు సస్పెండ్ చేశారు. బర్ధమాన్ రైల్వే స్టేషన్లోని 1,2,3 ప్లాట్ఫారమ్ల వద్ద రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. వాటర్ ట్యాంక్ కూలిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.