షిల్లాంగ్: మేఘాలయ ( Meghalaya) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అయితే తొలిరోజే సభలో గందరగోళం నెలకొన్నది. గవర్నర్ ఫాగు చౌహాన్ హిందీలో ప్రసంగించడంపై వాయిస్ ఆఫ్ పీపుల్స్ పార్టీ (వీపీపీ) ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం కాన్రాడ్ సంగ్మాతో వీపీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అర్డెంట్ మిల్లర్ బసాయావ్మోయిట్ తీవ్ర వాగ్వాదానికి దిగారు. మేఘాలయ హిందీ మాట్లాడే రాష్ట్రం కాదని అన్నారు. గవర్నర్ హిందీలో ప్రసంగించడం మేఘాలయ ప్రజల మనోభావాలకు విరుద్ధమని విమర్శించారు. కేంద్రం హిందీని మేఘాలయ ప్రజలపై బలవంతంగా రుద్దుతోందని ఆయన ఆరోపించారు.
కాగా, సీఎం కాన్రాడ్ సంగ్మా జోక్యం చేసుకున్నారు. సీనియర్ ఎమ్మెల్యే ఇలా ప్రవర్తించడం తాను ఊహించలేదని తెలిపారు. అయితే ఇంగ్లీష్లో ముద్రించిన గవర్నర్ హిందీ ప్రసంగం కాపీని సభ్యులందరికీ పంపిణీ చేసినట్లు అసెంబ్లీ స్పీకర్ థామస్ ఏ సంగ్మా చెప్పారు. ఈ నేపథ్యంలో గవర్నర్ హిందీలో ప్రసంగించేందుకు అనుమతించినట్లు వెల్లడించారు. దీంతో వీపీపీ ఎమ్మెల్యే సభ నుంచి వాకౌట్ చేశారు.
మరోవైపు మేఘాలయాలో అధికారంలో ఉన్న ఎన్పీపీ శాసనసభ్యుడు, ఆరోగ్య మంత్రి అంపరీన్ లింగ్డోహ్ కూడా గవర్నర్ హిందీ ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంగ్లంలో ఉన్న ప్రసంగం కాపీని సభ్యులకు అందించినప్పటికీ, హిందీ భాషను అనుసరించడం కష్టంగా ఉందని చెప్పారు. కాగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈశాన్య, దక్షిణ రాష్ట్రాల్లో హిందీని బలవంతంగా రుద్దుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో మేఘాలయ అసెంబ్లీలో ఈ సంఘటన జరుగడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
Also Read: