న్యూఢిల్లీ: పంటల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ-MSP) చట్టంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీంతో మరోసారి భారీ ఎత్తున నిరసనలకు (‘కిసాన్ ఆందోళన్ 2.0’) రైతులు సన్నద్ధమవుతున్నారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో సోమవారం ‘కిసాన్ మహాపంచాయత్’ జరిగింది. పలు రైతు సంఘాలకు చెందిన అన్నదాతలు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం)కు చెందిన 15 మంది ప్రతినిధుల బృందం సోమవారం మధ్యాహ్నం కృషి భవన్లో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్తో సమావేశమైంది. రైతుల డిమండ్లపై చర్చించింది.
కాగా, గత నిరసనల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని ఎస్కేఎం ప్రతినిధులు కేంద్రానికి గుర్తు చేశారు. రైతుల డిమాండ్లను మరోసారి కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచారు. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్తో ఆరు అంశాలపై చర్చించారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) హామీపై చట్టం, ఎంఎస్పీపై కమిటీ ఏర్పాటు, గత ఆందోళనలో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం, ఆందోళనల సందర్భంగా రైతులపై నమోదు చేసిన కేసుల ఉపసంహరణ, ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో వాహనంతో రైతులను తొక్కి చంపిన కేసుకు సంబంధించి అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని, విద్యుత్ బిల్లును సవరించాలని రైతు ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.
కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్తో సమావేశం అనంతరం రైతు నాయకులు మీడియాతో మాట్లాడారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చట్టంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదని రైతు నాయకుడు దర్శన్ పాల్ తెలిపారు. ‘హమ్ సర్కార్ చలాతే హై, ఆప్ ఆందోళన్ చలావో (మేం ప్రభుత్వాన్ని నడుపుతాం, మీరు (రైతులు) ఆందోళనలు చెయ్యండి)’ అని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తమతో అన్నట్లు ఆయన ఆరోపించారు.
మరోవైపు, మళ్లీ ఆందోళన బాట పట్టకుండా కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధంగా హామీ రాదన్నది కేంద్ర ప్రభుత్వ వైఖరి ద్వారా స్పష్టమైందని రైతు నేత రాకేష్ తికాయిత్ మీడియాతో అన్నారు. ఈ నేపథ్యంలో ‘కిసాన్ ఆందోళన్ 2.0’ కోసం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సిద్ధమవుతున్నదని చెప్పారు. దీని కోసం ఏప్రిల్ 30న ఢిల్లీలో మరోసారి సమావేశమవుతామని వెల్లడించారు. అయితే దీనికి ముందు అన్ని రైతు సంఘాలు తమ తమ రాష్ట్రాల్లో ర్యాలీలు, కిసాన్ పంచాయతీలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
'Kisan Mahapanchayat' underway at Ramlila Maidan in Delhi
Farmers have gathered here to demand a legal guarantee on MSP and fulfilment of their other demands. pic.twitter.com/CMkvAj1fKd
— ANI (@ANI) March 20, 2023
Also Read: