(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): దేశ న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకొచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కొన్ని స్వార్థమూకలు కుట్రకు తెగబడుతున్నాయని సీనియర్ న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ కుట్రలు కొనసాగుతున్నట్టు తెలిపారు. ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన అవినీతి కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు ఈ ఒత్తిళ్లు పెరుగుతున్నట్టు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు హరీశ్ సాల్వే, బార్ కౌన్సిల్ చైర్పర్సన్ మనన్ కుమార్ మిశ్రా సహా 600 మందికి పైగా న్యాయవాదులతో కూడిన బృందం సీజేఐ డీవై చంద్రచూడ్కు ఓ లేఖ రాశాయి.
‘రాజకీయ అజెండాతో స్వార్థ ప్రయోజనాలను ఆశించి కొన్ని గ్రూప్లు న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. కోర్టులపై ప్రజల్లో విశ్వాసాన్ని తగ్గించేందుకు తెగబడుతున్నాయి. ఇందుకోసం కోర్టులు ఇచ్చిన కీలక తీర్పులపై సోషల్మీడియాలో తప్పుడు కథనాలు సృష్టిస్తున్నాయి. ఈ మధ్య కొందరు న్యాయవాదులు పగటిపూట రాజకీయ నేతలను సమర్థించడం, రాత్రి మీడియా ద్వారా జడ్జిలను ప్రభావితం చేయడం వంటి అంశాలు బాధ కలిగిస్తున్నాయి’ అని లాయర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న రెండు విషయాలు తమను ఎంతో బాధకు గురిచేస్తున్నాయని న్యాయవాదుల బృందం లేఖలో పేర్కొంది. ‘అవినీతికి పాల్పడ్డారని బయట విమర్శించిన కొందరు రాజకీయ నేతలు.. కోర్టులోపలికి వచ్చేసరికి మాట మార్చేస్తారు. వారితో ఏకీభవించే విధంగా కోర్టు తీర్పు రాకపోతే.. న్యాయస్థానం లోపలే తీర్పును తప్పుబడుతున్నారు. బయట మీడియా ముందు కూడా ఇదే ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి రెండు నాల్కల ధోరణి ఎంతో ప్రమాదకరం. ఇక రెండోది.. తమకు అనుకూలమైన తీర్పులు ఇచ్చేలా కొందరు న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారు. దీనికోసం వారిపై సోషల్మీడియాలో దుష్ప్రచారానికి కూడా వెనుకాడట్లేదు. ఇది కోర్టుల సమగ్రత, చట్టపరమైన సూత్రాలను కాలరాయడమే’ అని న్యాయవాదుల బృందం లేఖలో పేర్కొంది. వ్యక్తిగత, రాజకీయ కారణాలతో కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించకూడదని పేర్కొన్న లాయర్ల బృందం.. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీజేఐను కోరింది.
న్యాయవాదుల లేఖ వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం విమర్శలకు దిగాయి. కాంగ్రెస్ను విమర్శిస్తూ ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘బెదిరించడం, వేధించడం కాంగ్రెస్ సంస్కృతి. ఐదు దశాబ్దాల క్రితం వారే కేంద్రానికి కట్టుబడి ఉండే న్యాయవ్యవస్థ కావాలని పిలుపునిచ్చారు. వాళ్ల స్వార్థ ప్రయోజనాలకు ఇతరులు నిబద్ధతతో ఉండాలని నిస్సిగ్గుగా కోరుకుంటున్నారు. కానీ, వాళ్లు మాత్రం దేశం పట్ల ఎలాంటి నిబద్ధతతో ఉండరు. 140 కోట్ల మంది భారతీయులు వాళ్లను తిరస్కరించడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.’ అని మోదీ పేర్కొన్నారు. మోదీ విమర్శలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తిప్పికొట్టారు. ‘ఒక వ్యవస్థ తర్వాత మరో వ్యవస్థను వేధించింది మీరే. మీ పాపాలకు కాంగ్రెస్ను బదనాం చేయడం ఆపండి. ప్రజాస్వామ్యాన్ని తారుమారు చేయడంలో, రాజ్యాంగాన్ని దెబ్బతీయడంలో మీరు నిపుణులు’ అంటూ పోస్ట్ చేశారు.