సుల్తాన్బజార్, జూన్ 23: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి తెలియజేయాలనే సంకల్పంతో అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ముందుకెళ్లటం అభినందనీయమని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. దేశ మాజీప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అర్బన్ ప్రాంతంలోని 2,500 అడుగుల కొత్తకొండ హిల్ మీద ఉన్న శిస్తుబండ పర్వతారోహణ చేసి పీవీకి ఘననివాళి అర్పించాలని నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని కొనియాడారు. బుధవారం హైదరాబాద్లోని బొగ్గులకుంటలో ఉన్న దేవాదాయ ధర్మాదాయశాఖ ప్రధానకార్యాలయ ఆవరణలో అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వ్యవస్థాపకుడు కే రంగారావు నిర్వహించ తలపెట్టిన పీవీ సమ్మిట్ను ఆయన ముఖ్యఅతిథిగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని నిజామాబాద్, వరంగల్ జిల్లాలలోని పలు ప్రాంతాలలో ఉన్న అద్భుతకట్టడాలను వెలికితీసి ప్రపంచానికి తెలియజేయాలన్న ఆలోచన గొప్పదని అన్నారు. రంగారావు మాట్లాడుతూ సుశిక్షితులైన 25 మంది పర్వరోహకులతో ఈ నెల 28న పర్వతారోహణ చేపట్టనున్నట్టు తెలిపారు.