Heavy Rains | దేశ వ్యాప్తంగా (India) గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఢిల్లీ (Delhi) సహా హర్యానా, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది. భారీ వర్షాలు, వరద సంబంధిత ఘటనల్లో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 100 మందికి పైగా మరణించారు. ఇందులో అత్యధికంగా హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రంలోనే 80 మంది ప్రాణాలు కోల్పోయారు.
గత కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలకు అతలాకుతలమవుతోంది. రాష్ట్రంలోని అనేక నదులు ఉప్పొంది ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల భారీగా కొండచరియలు విరిగి పడుతున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో సుమారు 300 మందికిపైగా పర్యాటకులు చిక్కుకుపోయారు.
ఇక పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో 15 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఆ రెండు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఇక ఉత్తరాఖండ్ లో గత 24 గంటల్లోనే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పర్వతాల నుంచి బండరాళ్లు జారిపడటంతో యాత్రికులు మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు.
ఇక దేశ రాజధాని ఢిల్లీ ప్రమాదపు అంచుల్లో ఉంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఢిల్లీలోని యమునా నది (Yamuna River) ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువన ఉన్న హర్యానా నుంచి వరద పోటెత్తడంతో నది నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో పెరిగింది. మంగళవారం మధ్యాహ్నానికి నీటి మట్టం 206 మీటర్లు (డేంజర్ మార్క్ 205.33 మీటర్లు) దాటింది. నది ఒడ్డున ఉండే పలు సమీప లోతట్టు ప్రాంతాల్లోకి కూడా నీరు చేరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను సోమవారం రాత్రి ప్రారంభించారు. నదిపైన ఉండే పాత రైల్వే బ్రిడ్జిని మూసేశారు. ఢిల్లీకి వరద పరిస్థితి లేదని మంత్రి సౌరవ్ భరద్వాజ్ పేర్కొన్నారు.
Also Read..
Kedarnath Dham Yatra: కేదార్నాథ్ యాత్ర నిలిపివేత.. ఆరెంజ్ అలర్ట్ జారీ
Delhi Yamuna River | ఉప్పొంగి ప్రవహిస్తున్న యుమునా నది.. డేంజర్ జోన్ దాటడంతో అలెర్ట్