CM Vijay : పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్యపై తమిళనాడు సీఎం (Tamil Nadu CM) విజయ్ (Joseph Vijay) స్పందించారు. ఇలాంటి అమానవీయ ఘటనలను సహించేది లేదని అన్నారు. శుక్రవారం వెలుగుచూసిన దారుణ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పారు. పదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి ప్రాణాలు తీయడం కలచివేసిందని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారని, కేసు దర్యాప్తు త్వరగా ముగించి దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని చెప్పారు. ఈ మేరకు సీఎం ఒక ప్రకటన చేశారు.
తమిళనాడు రాష్ట్రం కొయంబత్తూరు జిల్లాలోని సూలూర్ ఏరియాలో గురువారం సాయంత్రం పదేళ్ల బాలిక కిడ్నాప్కు గురైంది. కిరాణం దుకాణానికి వెళ్లేందుకని ఇంటి నుంచి బయటికి వచ్చిన బాలికను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు. శుక్రవారం సాయంత్రం సూలూర్ ఏరియాలోని కన్నంపాలయం చెరువు దగ్గర బాలిక మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. తమకు న్యాయం చేయాలని బాలిక కుటుంబసభ్యులు, బంధువులు సూలూర్ పోలీస్స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.
తాము రాష్ట్రంలో మార్పు కోసం విజయ్ పార్టీకి ఓటు వేశామని, కొత్త ప్రభుత్వం వచ్చినా ఎలాంటి మార్పు కనిపించడం లేదని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. సీఎం విజయ్ ఈ ఘటనపై స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. దాంతో సీఎం తాజా ప్రకటన చేశారు. బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.