స్పెషల్ టాస్క్ బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తారా స్థాయికి చేరాయా? అవే హిమాచల్ప్రదేశ్లో ఓటమికి కారణమయ్యాయా? అంటే అవునంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గుజరాత్లో గెలిచినా, పార్టీలో అంతర్గత విభేదాల వల్లే హిమాచల్ప్రదేశ్లో ఆ పార్టీ ఓడిపోయిందని చెప్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ర్టాల్లోనూ పార్టీ అంతర్గత పోరు తీవ్ర స్థాయిలో ఉన్నదని తెలిసి అధినాయకత్వం ఆందోళన చెందుతున్నది. హిమాచల్ ప్రదేశ్ పరిస్థితులే అక్కడా ఎదురైతే ఎలా? అని కలవరపడుతున్నది. వివిధ రాష్ర్టాల్లో పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు ప్రమాదం ఘంటికను మోగిస్తున్నాయని హిమాచల్ప్రదేశ్ ఓటమిని ఉటంకిస్తూ సంఘ్ పరివార్కు గళంగా భావించే ‘ఆర్గనైజర్’ పత్రిక కూడా తాజాగా విశ్లేషించింది.
అక్కడా అంతర్గత కుమ్ములాటలే
హిమాచల్ప్రదేశ్లో పార్టీ ఓటిమికి దారితీసిన అంతర్గత కుమ్ములాటలు త్రిపుర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, ఢిల్లీ, కేరళలోని పార్టీ వర్గాల్లోనూ నెలకొన్నాయి. ఈ పరిణామాలు కాషాయ దళాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైతే! కష్టమేనని పార్టీ నాయకత్వం ఆలోచనలో పడిందని విశ్లేషకులు చెప్తున్నారు. హిమాచల్ప్రదేశ్లో మోదీ చరిష్మా ఏమాత్రం పని చేయలేకపోయిందని, అంతర్గత కుమ్ములాటల ముందు మోదీ చరిష్మా అధిగమించలేదని ఇది నిరూపించిందని ఆర్గనైజర్ పత్రిక తెలిపింది.
నడ్డా అసమ్మతిని అధిగమించలేదు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన సొంత రాష్ట్రమైన హిమాచల్ప్రదేశ్లోనే పార్టీలో అంతర్గత కుమ్ములాటలను, అసమ్మతిని అధిగమించలేకపోయారు. ఫలితంగా పార్టీ నాయకులు 20 మంది తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగడంతో భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చింది. అభ్యర్థుల ఎంపిక మరీ పేలవంగా జరగటమే పార్టీ ఓటమికి కారణమని తిరుగుబాటు అభ్యర్థుల్లో ఒకరైన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిర్పాల్ పర్మాల్ పేర్కొన్నారు.
రాజస్థాన్లో అంతర్గత పోరుపై అసహనం
రాజస్థాన్ బీజేపీలో అంతర్గత పోరు తీవ్ర స్థాయికి చేరింది. దీనిపై నడ్డా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రారంభించిన ‘జన్ ఆక్రోశ్ యాత్ర’ను నడ్డా ఈ నెల 1న ప్రారంభించారు. ఆ సందర్భంగా వసుంధర రాజే, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీశ్ పూనియా మధ్య విభేదాలను తొలగించే ప్రయత్నం చేసారు. మరోవైపు, అక్కడ సీఎం పదవిని ఆశించే ఆశావహుల సంఖ్య అరడజనుకు చేరింది. ఈ రేసులో వసుంధరరాజే, పూనియా, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘ్వాల్ ఉన్నారు. జన్ ఆక్రోశ్ యాత్రలో పాల్గొనే వాహనాలపై తన బొమ్మ ఉంటే తప్ప తాను పాల్గొననని వసుంధర రాజే భీష్మించుకోవడంతో చివరకు ఇతరులను ఒప్పించడానికి నడ్డాకు తల ప్రాణం తోకకు వచ్చినంత పనైందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
గుజరాత్లో తక్కువేమీ కాదు
గుజరాత్లోనూ బీజేపీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమైంది. అయితే అక్కడ విజయం సాధించడంతో అసమ్మతి పోరు బహిర్గతం కాలేకపోయిందని విశ్లేషకులు అంటున్నారు. ఆరెస్సెస్ భావజాలం, బీజేపీతో అనుబంధం ఉన్నవారిని పక్కనపెట్టి గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వడం వల్లే గుజరాత్లో పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిందని పార్టీ విశ్లేషించుకొంటున్నది. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ వంటి అగ్రనాయకులను పార్టీ పక్కన పెట్టడమే కాకుండా 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే.
కర్ణాటకలో కలవరం
బీజేపీ పాలిత కర్ణాటకలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ పార్టీ పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతకు తోడు కాంగ్రె స్ పుంజుకోవడం బీజేపీ అధినాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. మాజీ సీఎం యెడియూరప్పను రాష్ట్రవ్యవహారాలకు దూరంగా పెట్టినట్టే కనిపిస్తున్నది. గుజరాత్ ఎన్నికల పరిశీలకుడిగా, పార్టీ పార్లమెంటరీ బోర్డు మెంబర్గా నియమించినంత మాత్రాన రాష్ట్రరాజకీయాల నుంచి తనను దూరం చేయలేరని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ అంతర్గత పోరుకు సంకేతంగా, అధిష్ఠానానికి హెచ్చరికలా ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.