బెంగళూరు, మార్చి 16 : అసెంబ్లీలో అధికార సభ్యుల తీరును నిరసిస్తూ విపక్షాలు వాకౌట్ చేయటం సర్వసాధారణం. ఇందుకు విరుద్ధంగా కర్ణాటక అసెంబ్లీలో సోమవారం స్పీకర్ సభ నుంచి వాకౌట్ చేశారు. ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలపై తగినంత సంఖ్యలో ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక సమాధానాలు రాకపోవటంతో స్పీకర్ ఖాదర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత మంత్రులు, కార్యదర్శులు వివరణ ఇచ్చే వరకు తాను సభను నడపబోనని పేర్కొంటూ సభ నుంచి వాకౌట్ చేశారు. సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి బయటకు వెళ్లిపోయారు.
స్పీకర్ నుంచి ఎదురైన అనూహ్య స్పందనతో సిద్ధరామయ్య సర్కార్ షాక్కు గురైంది. దీంతో హోంమంత్రి జీ పరమేశ్వర వెంటనే రంగంలోకి దిగి ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటున్నదని ప్రకటించారు. ఎమ్మెల్యేలు అడిగిన 230 ప్రశ్నలపై ఆయన 84 రాత పూర్వక సమాధానాల్ని సభ ముందు ఉంచారు. ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నల్లో కొన్నింటికే ప్రభుత్వం సమాధానం ఇవ్వటాన్ని శుక్రవారం నాటి సభలో స్పీకర్ ఖాదర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సౌమ్యంగా ఉండటాన్ని బలహీనతగా తీసుకోరాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.