Lok Sabha : లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో పార్లమెంట్లో ఆమోదం పొందిన పాత బిల్లును అమలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంటులో సీట్ల పెంపుతో సంబంధం లేకుండా తక్షణమే పాత మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని కోరుతున్నాయి. ఈ మేరకు ప్రతిపక్షాలన్నీ కలిసి ప్రధాని మోదీకి లేఖ రాయాలని నిశ్చయించినట్లు సమాచారం. ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడ్డ సంగతి తెలిసిందే.
ప్రతిపక్ష నేతలంతా కలిసి మహిళా రిజర్వేషన్ బిల్లు వ్యవహారంలో కేంద్ర వైఖరిని తప్పుబడుతున్నారు. కేంద్ర తప్పిదాలను ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో అన్ని పార్టీలు కలిసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల ప్రెస్ మీట్ నిర్వహించి కేంద్ర వైఖరిని ఎండగట్టడంతోపాటు బిల్లును అమలులోకి తేవాలని డిమాండ్ చేయబోతున్నాయి. అలాగే, రిజర్వేషన్ బిల్లు పేరుతో బీజేపీ భారతీయ రాజకీయ చిత్రాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తుందని విమర్శిస్తున్నాయి. సీట్ల పెంపుతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఉన్న సీట్లలోనే 33 శాతం మహిళా కోటా అమలు చేయాలని కోరుతున్నాయి. సీట్ల పెంపు ద్వారా రాజకీయ సమతుల్యత దెబ్బతింటుందని, రిజర్వేషన్ పాలసీ ఉద్దేశమే మారిపోతుందని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.
సభలో కొత్త రిజర్వేషన్ బిల్లు ఓడిపోవడంతో పాత బిల్లుపై పట్టుబట్టేందుకు సిద్ధమవుతున్నాయి. లోక్సభలో శుక్రవారం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఓడిపోయిన సంగతి తెలిసిందే. 2029 ఎన్నికల్లో లోక్సభలో మహిళా కోటా అమలుకు అనుగుణంగా, 2011 జనాభా లెక్కల ప్రకారం లోక్సభలో సీట్ల సంఖ్యను 543 నుంచి 816కు పెంచుతూ డీలిమిటేషన్ బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు సభలో 298 ఓట్లు అనుకూలంగా, 230 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. కావాల్సిన ఓట్ల సంఖ్య 352. దీంతో బిల్లు వీగిపోయింది.