న్యూఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో అవినీతి, కుటుంబ పాలనపై పోరాడాలని పిలుపు ఇవ్వడంపై కాంగ్రెస్ సహా విపక్షాలు దీటుగా స్పందించాయి. బీజేపీలోనూ పెద్దసంఖ్యలో వారసులున్నారని, ప్రజా తీర్పును పొందాల్సి ఉండటంతో ఎన్నికల రాజకీయాల్లో బంధుప్రీతి పనిచేయదని పేర్కొన్నాయి.
ఒక కుటుంబంపై కేంద్రం పోరాడుతోందని కాంగ్రెస్ నేత అల్కా లంబా మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు. ధరల పెరుగుదల నిరుద్యోగంపై పోరాడుతున్న ఓ కుటుంబంపై కేంద్ర ప్రభుత్వం పోరాడుతున్నదని ఆమె ట్వీట్ చేశారు. 130 కోట్ల కుటుంబాలతో కలిసి ధరల మంట, నిరుద్యోగంపై ఆ కుటుంబం పోరాడుతున్నదని గుర్తుచేశారు. చివరిగా 130 కోట్ల కుటుంబసభ్యులు ఈ పోరాటంలో విజయం సాధిస్తారని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ చేసిన బంధుగణం వ్యాఖ్యలపై టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ స్పందిస్తూ బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియాకు రాజకీయ నేపధ్యం ఉందని, రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ కుమారుడు ఎమ్మెల్యేగా ఉన్నారని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు శక్తివంతమైన పదవిలో ఉన్నారని చెప్పారు.