న్యూఢిల్లీ, మే 30: ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో విపక్షాలన్నీ ఏకం కావాలని సీపీఐ(ఎం) జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. సమాఖ్య స్ఫూర్తిపై కేంద్రం దాడి చేస్తున్నదని అన్నారు. ఢిల్లీ పాలనాధికారం తమదేనని కేంద్రం ఆర్డినెన్స్ తీసుకు రావడాన్ని ఆయన ఖండించారు. ఆర్డినెన్స్ను రాజ్యసభలో వ్యతిరేకించే విషయమై తమకు మద్దతు ఇవ్వాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఏచూరి మద్దతు కోరారు.
మంగళవారం సీపీఎం ఆఫీసులో ఏచూరిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఆర్డినెన్స్ విషయంలో ఆప్కు మద్దతు తెలపాలని కోరారు. నేడు ఢిల్లీకి ఎదురైన పరిస్థితి రేపు కేరళ, రాజస్థాన్ ప్రభుత్వాలకూ ఎదురు కావొచ్చన్నారు.