న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరల పెంపుతో మోదీ సర్కార్ లక్ష్యంగా విపక్షాలు విరుచుకుపడ్డాయి. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలపై విధించిన లాక్డౌన్ను తొలగించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రం తీరును ఆక్షేపించారు. నాలుగున్నర నెలల తర్వాత తొలిసారి ఇంధన, గ్యాస్ ధరలను సవరిస్తూ పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 80 పైసల చొప్పున పెంచగా ఎల్పీజీ సిలిండర్ ధరను ఏకంగా రూ 50 పెంచారు. తాజా పెంపుతో వంట గ్యాస్ సిలిండర్ ధర దేశవ్యాప్తంగా రూ 1000 దాటింది.
ఇక అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకూ ఎదురుచూసిన పాలకులు తాజా పెంపుతో జనంపై భారం మోపారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్వీట్ చేశారు. ఇక నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మతతత్వం, విద్వేషం విరజిమ్మడం మాత్రమే చౌకగా అందుబాటులో ఉంటాయని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ఎద్దేవా చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్ ధరను రూ 1000కి చేర్చాలనే లక్ష్యాన్ని నెరవేర్చుకున్నందుకు మోదీజీకి ధన్యవాదాలని చురకలు వేశారు. ఇక నుంచి ప్రతి రోజూ పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రతిరోజూ వికాస్ కనిపిస్తుందని వ్యాఖ్యానించారు.
ఇంధన ధరల పెంపుతో మోదీ సర్కార్ పేదల నుంచి రూ 10,000 కోట్లు దండుకుంటోందని దుయ్యబట్టారు. ఉక్రెయిన్-రష్యా సంక్షోభంతో ధరలు పెరుగుతున్నాయని పలువురు చెబుతుంటే తాము రష్యా నుంచి ఒక శాతం కూడా ముడి చమురు కొనుగోలు చేయలేదని పెట్రోలియం మంత్రి స్పష్టం చేశారని వ్యాఖ్యానించారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయంతో ప్రధాని మోదీ ఖరీదైన రోజులు తిరిగి వచ్చాయని ఇంధన ధరల పెంపుపై కేంద్రం తీరును కాంగ్రెస్ ప్రతినిధి రణ్దీప్ సుర్జీవాలా ఎండగట్టారు.