న్యూఢిల్లీ : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై విపక్షాలు (Opposition) ప్రభుత్వ తీరును తప్పుపట్టాయి. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు మహిళా ఓటర్లను వంచించేందుకే ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టిందని ఆప్ నేత అతిషి దుయ్యబట్టారు. మరోవైపు ప్రతిపాదిత బిల్లుతో ఇప్పట్లో మహిళలు లబ్ధి పొందే అవకాశం లేదని కాంగ్రెస్ పెదవివిరిచింది. మహిళా బిల్లును రాజకీయ పార్టీలు స్వాగతించినా నియోజకవర్గాల పునర్విభజన, జనగణనతో దీన్ని ముడిపెట్టడం పట్ల పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
2026లో చేపట్టే తదుపరి పునర్విభజన ప్రక్రియ ముగిసిన అనంతరం ఈ బిల్లు అమల్లోకి రానుంది. ఈ బిల్లును ఇవాళ ప్రవేశపెట్టినా మహిళలకు ఇప్పట్లో కలిగే ప్రయోజనం శూన్యమని కాంగ్రెస్ పేర్కొంది. అసలు జనగణన ఎప్పుడు జరుగుతుందనే దానిపై ఎలాంటి సమాచారం లేదని, ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ మరో తాయిలం విసిరారని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.
మహిళా బిల్లుకు ఆప్ మద్దతుపై అడిగిన ప్రశ్నకు ఆ పార్టీ నేత అతిషి బదులిస్తూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు వర్తిస్తాయా లేదా అనేది కీలకమని, అది సాధ్యం కాకుంటే ఈ బిల్లు మహిళలను వంచించేందుకేనని దుయ్యబట్టారు. అసలు ఈ బిల్లులో జనగణన, నియోజకవర్గాల పునర్విభజేన క్లాజ్లను చేర్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. 2024 లోక్సభ ఎన్నికల్లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను వర్తింపచేసేలా బిల్లులో అవసరమైన మార్పులు చేయాలని ఆప్ డిమాండ్ చేస్తోందని అన్నారు.
Read More :