బెంగళూర్ : ప్రధాని నరేంద్ర మోదీ మరొకరిని బాధితుడిగా మార్చారని, కర్నాటక సీఎం బీఎస్ యడ్యూరప్పను బలవంతంగా రిటైర్మెంట్ క్లబ్లో చేర్చారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. కర్నాటకలో జరుగుతున్న పరిణామాలు మంచివి కాదని, ఓ అవినీతిపరుడిని తొలగించి మరో అవినీతిపరుడికి సీఎంగా పట్టం కట్టడం వల్ల రాష్ట్రానికి ఎలాంటి మేలూ జరగదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య అన్నారు.
కర్నాటక ప్రజల కష్టాలకు కారణమైన కాషాయపార్టీని కూలదోస్తేనే మేలు జరుగుతుందని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. సీనియర్ బీజేపీ నేతలను బలవంతంగా తప్పిస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జీవాల్ ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యేల ఆకాంక్షలకు విరుద్ధంగా ఢిల్లీ నుంచే సీఎంలను ఆయా రాష్ట్రాలపై రుద్దుతున్నారని మండిపడ్డారు. కాగా, బీజేపీ అధిష్టానం ఆదేశాలతో కర్నాటక సీఎం పదవికి బీఎస్ యడ్యూరప్ప రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.