బెంగళూరు, జూలై 17: మరో ఏడాదిలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు అధికారమే పరమావధిగా పోటాపోటీగా సమావేశమవుతున్నాయి. ఓవైపు బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాలు బెంగళూరులో భేటీ అవుతుండగా, మరోవైపు ఢిల్లీలో ఎన్డీఏ మిత్రపక్షాల భేటీ జరగనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పాట్నాలో జరిగిన తొలి విడత భేటీతో భయపడిన బీజేపీ తన మిత్రపక్షాలతో భేటీ అవుతున్నట్టు విపక్ష పార్టీల నాయకులు చెబుతుండగా… విపక్షాలకు ప్రధాని అభ్యర్థే లేరని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.
టీఎంసీతో పొత్తు ప్రసక్తే లేదు
పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని సీపీఐ(ఎం) నేత సీతారాం ఏచూరి తేల్చిచెప్పారు. బెంగళూరులో సోమవారం ఆయన మాట్లాడుతూ… పశ్చిమబెంగాల్లో బీజేపీతో పాటు టీఎంసీతో పోరాడతామన్నారు.
చర్చలకు సమయం కాదిది
ఎనిమిది నెలల తర్వాత లోక్సభ ఎన్నికలు జరగనున్నాయని, పొత్తుపై ఇప్పుడే మాట్లాడటం సరికాదని జేడీఎస్ అధినేత కుమారస్వామి తెలిపారు. బెంగళూరులో ఆయన సోమవారం మాట్లాడారు. రైతు ఆత్మహత్యలను పట్టించుకోని కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం, విపక్ష భేటీని గొప్ప ఘనతగా చూపాలనుకుంటున్నదని దుయ్యబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 42 మంది రైతులు అసువులుబాశారని విమర్శించారు.