న్యూఢిల్లీ: మణిపూర్ అంశం(Manipur issue)పై గత అయిదు రోజుల నుంచి పార్లమెంట్ సమావేశాలు దద్దరిల్లుతున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఆ అంశంపై ఉభయసభల్లో ప్రకటన చేయాలని విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఇవాళ కూడా లోక్సభలో విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. దీంతో లోక్సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ప్రధాని మోదీ సమక్షంలో మణిపూర్లో జరుగుతున్న హింసాకాండపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇవాళ ఉదయం పార్లమెంట్ ఆవరణలో కొందరు ఎంపీలు నల్ల దుస్తులు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. రాజ్యసభకు చెందిన విపక్ష ఎంపీలు ఆ ఆందోళనలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ సభకు వచ్చి మణిపూర్పై ప్రకటన చేయాలని ఆ ఎంపీలు నినాదాలు చేశారు. నల్ల దుస్తులు ధరించిన విపక్ష ఎంపీలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శలు చేశారు. ఆ దుస్తులు ధరించిన వాళ్ల ప్రస్తుత పరిస్థితి, గతం, భవిష్యత్తు కూడా నలుపే అని ఆయన రాజ్యసభలో ఆరోపించారు. కానీ వాళ్ల జీవితాల్లో వెలుగు వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఓటు బ్యాంకు రాజకీయాలు..
మణిపూర్ అంశంపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పందించారు. బీజేపీ, ప్రధాని ఒక్కటే అని, ఆర్ఎస్ఎస్ విద్వేషాన్ని వ్యాప్తి చేసిందని, బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నట్లు ఆయన ఆరోపించారు. మణిపూర్లో జరుగుతున్న పరిణామాలకు ఇదే తార్కాణమని ఆయన అన్నారు. ప్రభుత్వం అన్ని అంశాలపై అవగాహనతో ఉండాలన్నారు. ఏజెన్సీలకు ఏమీ తెలియదని పేర్కొనడం శోచనీయమన్నారు.