Opposition MPs | ఉభయసభల నుంచి సస్పెన్షన్కు గురైన ప్రతిపక్ష ఎంపీలు (Opposition MPs) గురువారం ఆందోళనకు దిగారు. పాత పార్లమెంట్ భవనం నుంచి సెంట్రల్ ఢిల్లీలోని విజయ్ చౌక్ వరకూ ధర్మా చేపట్టారు. ‘ప్రజాస్వామ్యాన్ని రక్షించండి’ అంటూ ప్లకార్డులను చేతపట్టి భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు (Hold March).
కాగా, ఇటీవలే లోక్సభలో భద్రతా ఉల్లంఘన ఘటన పార్లమెంట్ను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రకటన చేయాలని ఉభయసభల్లో ప్రతిపక్ష ఎంపీలు పట్టుబడుతున్నారు. అయితే ఆందోళన చేపడుతున్న విపక్ష ఎంపీలపై కేంద్ర ప్రభుత్వం సస్పెన్షన్ కొరడా ఝళిపిస్తున్నది. వరుసగా ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేస్తున్నది. ఈ క్రమంలో ఎగువ, దిగువ సభల నుంచి ఇప్పటి వరకూ మొత్తం 143 మంది ఎంపీలను సస్పెండ్ చేసింది.
ఈ నెల 14న 14 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. సోమవారం మరో 78 మంది, మంగళవారం 49 మంది, బుధవారం ఇద్దరు ఎంపీలు సస్పెన్షన్కు గురయ్యారు. లోక్సభ, రాజ్యసభలో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. ఈ నెల 13న పార్లమెంట్ భద్రతా వైఫల్యం నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు నినాదాలు చేస్తూ పట్టుబట్టాయి. మరో వైపు సభల్లో సభాపతి ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఎంపీలను సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం సమర్థించుకోగా.. ప్రతిపక్షాల గొంతును ప్రభుత్వం అణచివేస్తుందని విపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు.
Also Read..
Ponmudy | అవినీతి కేసులో తమిళనాడు మంత్రి పొన్ముడికి మూడేళ్లు జైలు శిక్ష
Twitter | ఎక్స్లో పోస్టులు మాయం.. గందరగోళానికి గురవుతున్న యూజర్లు