న్యూఢిల్లీ, మార్చి 24: ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినదిస్తూ శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న ప్రతిపక్ష పార్టీల ఎంపీలపై పోలీసులు దౌర్జన్యం చేశారు. దేశ రాజధానిలో పార్లమెంటుకు కూత వేటు దూరంలోనే ఎంపీలపై బలప్రదర్శనకు దిగారు. ఎంపీల చేతుల్లో నుంచి ప్లకార్డులను లాక్కున్నారు. మహిళా ఎంపీలని కూడా చూడకుండా జులుం ప్రదర్శించారు. బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని గళమెత్తినందుకు ప్రతిపక్ష ఎంపీలను కేంద్రం ఈ రకంగా అవమానించింది. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని విపక్ష పార్టీల ఎంపీలు దేశ రాజధానిలో నిరసన ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీల ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ హౌజ్ నుంచి ర్యాలీగా బయలుదేరారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నదని నినదిస్తూ శాంతియుతంగా ముందుకు కదిలారు. కేంద్రం వెంటనే అదానీ అంశంపై జేపీసీ వేయాలని, ఎల్ఐసీని కాపాడాలంటూ డిమాండ్ చేశారు. వీరిని విజయ్ చౌక్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. సెక్షన్ 144 అమల్లో ఉండగా నిబంధనలు ఉల్లంఘించి నిరసన ర్యాలీ చేపట్టారనే సాకుతో ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. కేసీ వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌదురి, కే సురేశ్, మాణిక్కం ఠాగూర్, ఇమ్రాన్ ప్రతాప్గర్హి, మహ్మద్ జావెద్ సహా 40 మంది ఎంపీలను బలవంతంగా అరెస్టు చేశారు. ఇందులో పలువురు మహిళా ఎంపీలు కూడా ఉన్నారు. వీరి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు.
అంతకుముందు.. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై లోక్సభ అనర్హత వేటు వేయటంపై విజయ్ చౌక్ వద్ద కాంగ్రెస్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో సీపీఐ, సీపీఎం, శివసేన(ఉద్ధవ్ ఠాక్రే), జేడీయూ, ఆప్ పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ ‘అదానీ అంశంపై జేపీసీ వేయాలని నెలలుగా డిమాండ్ చేస్తున్నాం. బీజేపీకి మెజారిటీ ఉన్నా ఎందుకు భయపడుతున్నది? అంటే.. ఇందులో ఏదో మతలబు ఉన్నదనే కదా! దీనిపై మేమంతా ఐక్యంగా పోరాడుతూనే ఉంటాం’ అని స్పష్టం చేశారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ… ప్రతిపక్ష పార్టీలపై కేసులు మోపి అంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నదనడానికి రాహుల్ గాంధీకి శిక్ష విధించడమే నిదర్శనమన్నారు.