న్యూఢిల్లీ: పార్లమెంట్లో విపక్షాలు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. లోక్సభ, రాజ్యసభలో ఇవాళ ఉదయం భారీ స్థాయిలో విపక్షాలు నిరసన నినాదాలు వినిపించాయి. రాజ్యసభలో విపక్ష సభ్యులు వెల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. పెగాసస్ ప్రాజెక్టు నివేదికపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ చట్టాలు చేసేందుకు ఉందని, కానీ సభ కార్యక్రమాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నట్లు వెంకయ్య అన్నారు. పార్లమెంట్ దిగజారిన తీరు దురదృష్టకరమని ఆయన అన్నారు. అయినా విపక్ష సభ్యులు పట్టువీడకపోవడంతో సభను ఆయన 12 గంటల వరకు వాయిదా వేశారు.
ఇక లోక్సభలో కూడా విపక్ష సభ్యులు నినాదాలతో కార్యక్రమాలను అడ్డుకున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి దూసుకువెళ్లి నినాదాలు చేశారు. నినాదాలు తీవ్ర స్థాయికి చేరడంతో.. స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు.