న్యూఢిల్లీ, డిసెంబర్ 12: బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కసరత్తు చేస్తున్నారని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం తక్షణావసరం అని అన్నారు. దానికోసం కేసీఆర్, మమత, నితీశ్ చర్యలు తీసుకొంటున్నారని వెల్లడించారు. ఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ పాలనలో ద్రవ్యోల్బణం ఉచ్ఛస్థితికి చేరుకున్నదని, నిరుద్యోగం తీవ్ర స్థాయికి చేరిందని అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా భారతీయులకు కల్పించిన హక్కులను హరిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం అవసరం ఎంతో ఉన్నదని అభిప్రాయపడ్డారు.
బీఆర్ఎస్తో నితీశ్ చర్చలు
కేంద్రంలోని బీజేపీని ఎదుర్కొనేందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తో చర్చలు జరుపుతున్నట్టు బీహార్ సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. తాను బీఆర్ఎస్ నేతలతో టచ్లో ఉన్నానని వెల్లడించారు. 2024లో బీజేపీని ఓడించాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. జనవరి తొలి వారంతో విపక్షాల నేతలతో నితీశ్ సమావేశమయ్యే అవకాశాలున్నాయి. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మిత్ర ద్రోహానికి పాల్పడిందని శనివారం నితీశ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ-జేడీయూ కలిసి పోటీ చేసినా, జేడీయూ అభ్యర్థుల ఓటమికి కుట్ర చేసిందని మండిపడ్డారు.