న్యూఢిల్లీ, జనవరి 22: అయోధ్యలో అంగరంగ వైభవంగా జరిగిన బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి వేలాది మంది ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో రాజకీయ నాయకుల నుంచి సినీ స్టార్లు, క్రీడాకారులు, కళాకారులు, పారిశ్రామికవేత్తలు, సాధువులు ఇతర ప్రముఖులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ ట్రస్టు కాంగ్రెస్ సహా పలువురు విపక్ష నేతలను ఆహ్వానించింది. అయితే చాలా మంది విపక్ష నేతలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
కోల్కతాలో మమత ర్యాలీ
పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ కోల్కతాలో ‘మత సామరస్య’ ర్యాలీ చేపట్టారు. కాలిఘాట్ ఆలయంలో పూజల తర్వాత ఆమె ర్యాలీ చేపట్టారు. అయోధ్య కార్యక్రమం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే.. మమత ఉద్దేశపూర్వకంగా ఈ ర్యాలీ చేపట్టారని బీజేపీ ఆరోపించింది.
ఢిల్లీలో ఆప్ శోభాయాత్రలు
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మంత్రు లు, ఆప్ ఎమ్మెల్యేలు ఢిల్లీవ్యాప్తంగా జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అన్నదానాలు, శోభాయాత్రలు నిర్వహించారు. భారత సమాజానికి రాముడు గొప్ప ప్రతీక అని, తనకు ఆహ్వానం అందిందని, అయితే అయోధ్యకు కుటుంబంతో తర్వాత వెళ్తానని కేజ్రీవాల్ అంతకుముందు పేర్కొన్నారు.
తమిళనాడులో డీఎంకే x బీజేపీ
మసీదును కూల్చి ఆలయాన్ని నిర్మించడాన్ని తాము ఆమోదించడం లేదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే నేత ఉధయనిధి స్టాలిన్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు అయోధ్య కార్యక్రమం లైవ్ ప్రసారాలను రాష్ట్ర సర్కార్ అడ్డుకొంటున్నదని బీజేపీ ఆరోపించగా.. అధికార డీఎంకే ఆరోపణలను ఖండించింది.
దూరంగా ఇతర ప్రముఖ విపక్ష నేతలు
ప్రాణప్రతిష్ఠ ఆహ్వానానికి ట్రస్టుకు కృతజ్ఞతలు తెలిపిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. రద్దీ దృష్ట్యా తాను తర్వాత అయోధ్యకు వెళ్తానని పేర్కొన్నారు. 1990లో అద్వానీ రథయాత్రను బీహార్ అడ్డుకొన్న అప్పటి సీఎం ఆర్జేడీ అగ్రనేత లాలూ ప్రసాద్ కూడా కార్యక్రమానికి వెళ్లలేదు. ఇందుకు ఆయన కారణం వెల్లడించలేదు. ఇక తమ కుటుంబంతో ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్యకు వెళ్తామని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వెల్లడించారు. బీజేపీ మతాన్ని, రాజకీయాలను కలబోస్తున్నదని ఆరోపిస్తూ సీపీఎం ప్రాణప్రతిష్ఠకు దూరంగా ఉన్నది.
ఆలయంలోకి రాహుల్కి అనుమతి నిరాకరణ!
భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్సాంలో ఉన్నారు. నాగావూన్లో ఉన్న బటద్రవ సత్ర గుడిలోకి తనను అధికారులు రానివ్వడం లేదని ఆరోపిస్తూ ధర్నా చేశారు. ప్రాణప్రతిష్ఠ ఆహ్వానితులైన కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, సోనియా కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. అయోధ్య కార్యక్రమాన్ని బీజేపీ ‘పొలిటికల్ ఈవెంట్’గా మార్చిందని, అందుకే హాజరుకావడం లేదని కాంగ్రెస్ పేర్కొన్నది.