ఇంఫాల్ : అల్లర్లతో అట్టుడికిన మణిపూర్లో (Manipur Violence) క్షేత్రస్ధాయి పరిస్ధితిని మదింపు చేసేందుకు విపక్ష కూటమి ఇండియా ప్రతినిధులు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. 21 పార్టీలకు చెందిన విపక్ష నేతలు మణిపూర్లో పర్యటిస్తూ హింసాకాండ వివరాలను స్ధానికులను అడిగి తెలుసుకుంటున్నారు. కుకీ, మితైయ్ తెగలకు చెందిన ప్రజలతో మాట్లాడటంతో పాటు సహాయ పునరావాస శిబిరాలను విపక్ష ఎంపీలు సందర్శించారు. ప్రతినిధి బృందం సభ్యులు ఆదివారం మణిపూర్ గవర్నర్ అనసూయ యుకీని కలిసి విజ్ఞాపన పత్రం సమర్పించారు.
తమ పరిశీలనలో తేలిన అంశాలను విపక్ష ఎంపీలు పార్లమెంట్లో ప్రస్తావించనున్నారు. మరోవైపు మణిపూర్లో విపక్ష ఎంపీల ప్రతినిధి బృందం పర్యటనను పాలక బీజేపీ తప్పుపట్టింది. విపక్ష ప్రతినిధులు కేవలం ఫొటో సెషన్కు, రాజకీయ యాత్రకే పరిమితమని కాషాయ పార్టీ ఆక్షేపించింది.
విపక్ష నేతల ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ ఎంపీలు అధీర్ రంజన్ చౌధరి, గౌరవ్ గగోయ్, టీఎంసీకి చెందిన సుశ్మితా దేవ్, జేఎంఎం ఎంపీ మహువ మజీ, డీఎంకే ఎంపీ కనిమొళి, ఆర్జేడీకి చెందిన మనోజ్ కుమార్ ఝా, ఆరెల్డీ ఎంపీ జయంత్ చౌధరి, ఆరెస్పీకి చెందిన కే ప్రేమచంద్రన్, జేడీయూ నేత రాజీవ్ రంజన్ సింగ్, జేడీయూ ఎంపీ అనిల్ ప్రసాద్ హెగ్డే, సీపీఐ నేత సందోష్ కుమార్, సీపీఎం నేత ఏఏ రహీం తదితరులున్నారు.
Read More :