న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల కురిసిన వర్షాలు, వీచిన గాలులు ఆ మహా నగరానికి మేలు చేశాయి. ఎప్పుడూ కాలుష్యంతో నిండి ఉండే ఢిల్లీ వాతావరణం ఇప్పుడు మారిపోయింది. గతంలో ఎప్పుడూ లేనంతగా వాయు నాణ్యత మెరుగుపడింది. వర్షాలు, గాలుల కారణంగా ఢిల్లీ వాతావరణం శుభ్రపడటంతో శనివారం అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 59 కి దిగివచ్చింది.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB) ఆదివారం విడుదల చేసిన బులెటిన్లో ఈ విషయాన్ని వెల్లడించింది. దాంతో ఢిల్లీలో శనివారం నమోదైన వాయు నాణ్యతే ఈ ఏడాదిలో అత్యంత స్వచ్ఛమైన వాయు నాణ్యతగా రికార్డుల్లో నిలిచింది. సాధారణంగా AQI 51 నుంచి 100 మధ్యలో ఉంటే సంతృప్తికరమైన వాయు నాణ్యతగా పేర్కొంటారు. కాగా, వేసవి సమయాల్లో ఢిల్లీ AQI 400కు చేరిన సందర్భాలు కూడా ఉన్నాయి. AQI 400 అంటే వాయు నాణ్యత అత్యంత కలుషితంగా మారిందని అర్థం.