న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి తొలి బహిరంగ సభ (INDIA’s 1st public meet ), బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరుగనున్నది. అక్టోబరు మొదటి వారంలో దీనిని నిర్వహించాలని ఆ కూటమి నిర్ణయించింది. ఇండియా బ్లాక్ కోఆర్డినేషన్ కమిటీ తొలి సమావేశం బుధవారం జరిగింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ ఢిల్లీ నివాసంలో 14 మంది సభ్యులతో కూడిన ప్యానెల్ సమావేశమైంది.
కాగా, 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకం సహా పలు అంశాలపై ‘ఇండియా’ బ్లాక్ సమన్వయ కమిటీ చర్చించింది. అక్టోబర్ మొదటి వారంలో భోపాల్లో తొలి బహిరంగ సభ నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. బీజేపీ ప్రభుత్వంలోని అవినీతి, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలపై ఈ పబ్లిక్ మీటింగ్లో ప్రధానంగా లేవనెత్తనున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు సుమారు 25కుపైగా రాజకీయ పార్టీలు ‘ఇండియా’ కూటమి పేరుతో ఒకతాటిపైకి వచ్చాయి. కలిసికట్టుగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.