న్యూఢిల్లీ: ఒడిశాలో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదానికి (Odisha train tragedy) రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నైతిక బాధ్యత వహించాలని, మంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. అలాగే రైళ్లలో భద్రతా వ్యవస్థలపై పలు ప్రశ్నలు సంధించాయి. పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, కేంద్రంలోనీ బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిలదీశారు. ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు రైళ్లు ఢీకొనకుండా అరికట్టే పరికరాలను అమర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. దీనికి బదులు ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టే సాఫ్ట్వేర్ కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు.
కాగా, ప్రజలను తప్పుదోవ పట్టించడం ద్వారా రాజకీయ మద్దతు పెంచుకోవడానికి వందే భారత్ రైళ్లు, కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్ల గురించి మోదీ ప్రభుత్వం గొప్పగా చెబుతోందని అభిషేక్ బెనర్జీ విమర్శించారు. అయితే భద్రతా చర్యలను విస్మరించారని మండిపడ్డారు. ‘నోట్ల రద్దు, జీఎస్టీ, లాక్డౌన్లు, వ్యవసాయ చట్టాలు, రైల్వే భద్రతా లోపాలు వంటి ‘కేంద్రం ఉదాసీనత’ చర్యల భారాన్ని భరించేది పేద, అట్టడుగు వర్గాల ప్రజలే’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు మూడు రైళ్ల ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాల పట్ల తన హృదయం బాధతో తపించిపోతున్నదని అభిషేక్ బెనర్జీ అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. ఏ మాత్రం మనస్సాక్షి మిగిలి ఉన్నా రైల్వే మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేశారు.