న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. దీనికోసం భారతీయ వాయుసేన రంగంలోకి దిగింది. భారతీయుల తరలింపునకు చేపట్టిన ఆపరేషన్ గంగలో (Operation Ganga) భాగంగా వాయుసేనకు చెందిన సీ-17 రవాణా విమానం రొమేనియా బయల్దేరి వెల్లింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో ఉన్న హిండన్ ఎయిర్బేస్ నుంచి బయలుదేరి వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
ఉక్రెయిన్లోని భారతీయులను తరలించే అంశంపై ప్రధాని మోదీ మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన కొద్దిసేపటికే ఆపరేషన్ గంగలో భాగమవుతున్నట్లు వాయుసేన ప్రకటించింది. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ మందిని తరలించేందుకు వీలుండనుంది.
ఉక్రెయిన్లో 20 వేల మంది భారతీయులు ఉన్నట్లు విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు. వారిలో 60 శాతం మందిని ఇప్పటికే స్వదేశానికి తరలించామని చెప్పారు. మరో 40 శాతం మందిని భారత్కు తీసుకురావడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. వారిలో సుమారు 20 శాతం మంది ఖార్కివ్లోనే ఉన్నారని పేర్కొన్నారు. ఉక్రెయిన్లో చిక్కున్నవారిని తరలించడానికి బుకారెస్ట్, బుడాపెస్ట్తోపాటు పోలండ్, స్లొవేకియాలోని విమానాశ్రయాలను ఉపయోగించుకుంటున్నామని చెప్పారు.