Karnataka | బెంగళూరు: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ‘సీఎం మార్పు’ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సీఎం సిద్ధరామయ్య కుమారుడు, మాజీ ఎమ్మెల్యే యతీంద్ర చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. హసన్లో బుధవారం యతీంద్ర మాట్లాడుతూ వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలవడం ద్వారా తన తండ్రి సిద్ధరామయ్య ఎలాంటి ‘అడ్డంకులు’ లేకుండా ఐదేండ్ల పాటు సీఎంగా కొనసాగుతారని, గ్యారెంటీ పథకాలు అమలవుతాయని అన్నారు.
సీఎం సిద్ధరామయ్య పదవీకాలంపై యతీంద్ర చేసిన వ్యాఖ్యలను వక్రీకరించాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు. అటు యతీంద్ర వ్యాఖ్యలపై బీజేపీ నేత అశోక మాట్లాడుతూ సీఎంగా సిద్ధరామయ్యకు రోజుల లెక్కింపు ప్రారంభమైందనేది ఇక రహస్యంగా ఉండబోదని అన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఆయనకు ఆ పార్టీ హైకమాండ్ ‘ఎగ్జిట్ డోర్’ చూపిస్తుందని పేర్కొన్నారు.