న్యూఢిల్లీ, జూలై 27: కోట్ల మంది నిరుద్యోగులకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహం పార్లమెంటు సాక్షిగా మరోసారి బయటపడింది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని స్వయంగా ప్రకటించిన నరేంద్రమోదీ, ఏటా లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను వెన్నుపోటు పొడిచినట్టు తేలిపోయింది. మరోవైపు దేశంలో నిరుద్యోగిత ఎంతటి ప్రమాదస్థాయికి చేరిందో కేంద్రం లెక్కలే స్పష్టంచేశాయి. గత ఏడేండ్లలో ప్రభుత్వ శాఖలో 7,22,311 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ బుధవారం లోక్సభలో ప్రకటించారు. ఈ ఉద్యోగాలకు ఏకంగా 22,05,99,238 మంది దరఖాస్తు చేశారని మంత్రే చెప్పటం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వం ఇదే కాలంలో 1.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. మరో 90 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నది.
లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా
కేంద్రంలో దాదాపు 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాటిని భర్తీచేయటానికి మాత్రం ఇప్పటికీ సాగదీస్తూనే ఉన్నది. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో.. మొత్తం జనాభాలో 60 శాతం యువతే ఉన్న దేశంలో మోదీ సర్కారు 2018-19 ఆర్థిక సంత్సరంలో భర్తీచేసిన ఉద్యోగాలు 38,100. 2021-22లోనూ అదే మోసం జరిగింది. ఆ ఆర్థిక సంవత్సరంలో 38,850 ఉద్యోగాలు మాత్రమే భర్తీచేసింది.