న్యూఢిల్లీ, డిసెంబర్ 22: పార్లమెంటులో బిల్లులపై అర్థవంతమైన చర్చలు తీరని కలగానే కనిపిస్తున్నది. 17వ లోక్సభలో ఇప్పటివరకు ఆమోదం పొందిన మొత్తం బిల్లులలో సగానికిపైగా బిల్లులపై రెండు గంటల కన్నా తక్కువ వ్యవధిలోనే తూతూ మంత్రంగా చర్చ జరిగిందని, పైగా 16 శాతం బిల్లులు మాత్రమే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపారని స్వతంత్ర పరిశోధన సంస్థ పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రిసెర్చ్ వెల్లడించింది.
పార్లమెంట్ శీతాకాల సమవేశాలు గురువారంతో ముగియడంతో ఆ సంస్థ శుక్రవారం వివరాలు తెలియజేసింది. దీని ప్రకారం.. 17వ లోక్సభలో ఇప్పటివరకు 172 బిల్లులు ఆమోదం పొందాయి. వాటిలో 86 బిల్లులపై లోక్సభలో, 103 బిల్లులపై రాజ్యసభలో రెండు గంటల కన్నా తక్కువ సమయమే సభ్యులు చర్చ జరిపారు. అలాగే మొత్తం బిల్లుల్లో లోక్సభలో 16, రాజ్యసభలో 11 బిల్లులపై జరిగిన చర్చల్లో మాత్రమే 30 మంది కంటే ఎక్కువ మంది సభ్యులు పాల్గొన్నారు.
డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోని ఏకైక సభగా 17వ లోక్సభ నిలిచింది. రాజ్యాంగం ప్రకారం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తప్పనిసరి. ఎన్నికలు అయిన వెంటనే సాధ్యమైనంత త్వరగా డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సభలో దాని గురించి అధికార పార్టీ పట్టించుకోలేదు.
ఈ ఏడాది శీతాకాల సమావేశాల్లో అసాధారణ రీతిలో లోక్సభ నుంచి 100 మంది, రాజ్యసభ నుంచి 46 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. ఇది ప్రతి సభలో మొత్తం సభ్యుల సంఖ్యలో 19 శాతంతో సమానం. అంతేకాకుండా ఇంతవరకు ఏ లోక్సభలోనూ ఇంత పెద్దమొత్తంలో సభ్యులను సస్పెండ్ చేయలేదు.