న్యూఢిల్లీ, డిసెంబర్ 19: దేశంలో ఏటా లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యను పూర్తిచేసుకుని కళాశాలల నుంచి బయటకు వస్తున్నారు. అయితే వారిలో కనీసం 20 శాతం మందికి కూడా ఉద్యోగం దొరుకుతుందన్న గ్యారంటీ లేకుండా పోయింది. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉందని, 15 లక్షల మంది గ్రాడ్యుయేట్లలో కేవలం 10 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు లభించే అవకాశం ఉన్నదని తాజా అధ్యయనం పేర్కొన్నది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఐటీ కంపెనీల్లో ఈ సారి ఫ్రెషర్ల నియామకాల సంఖ్య 35-40 శాతం పడిపోయిందని ఐటీ, ఇంజినీరింగ్, ఎడ్టెక్ తదితర రంగాల్లో టెక్నాలజీ స్టాఫింగ్ సేవలు అందించే ‘టీమ్లీజ్ డిజిటల్’ తెలిపింది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో 2.3 లక్షల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు పొందారని టీమ్లీజ్ డిజిటల్ పేర్కొన్నది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య భారీగా పడిపోతుందని, కేవలం 1.6 లక్షల మంది ఫ్రెషర్లు మాత్రమే రిక్రూట్ అయ్యే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఇటీవలి కాలంలో కంపెనీల యాజమాన్యాలు ఫ్రెషర్లకు ఆర్నెల్లు ట్రైనింగ్ ఇచ్చి నియమించుకోవడం కంటే 7-12 ఏండ్ల అనుభవం ఉన్న వారిని రిక్రూట్ చేసుకొనేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయని టీమ్లీజ్ డిజిటల్ బిజినెస్ హెడ్ క్రిష్ణ విజ్ అన్నారు. గత రెండేండ్లుగా ప్రపంచ దిగ్గజ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో అమెరికా, ఇతర దేశాల నుంచి టెకీలు దేశ ఉద్యోగ రంగంలోకి వచ్చారు. ఇది దేశంలోని ఉద్యోగార్థులపై ప్రభావం చూపుతుందనే వాదనలు కూడా ఉన్నాయి.
ఉద్యోగాలు పొందేందుకు అభ్యర్థికి సంబంధిత రంగానికి చెందిన నైపుణ్యాలు ఉండటం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో మొత్తం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో కేవలం 45 శాతం మందిలో మాత్రమే పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలు ఉన్నాయని క్రిష్ణ విజ్ పేర్కొన్నారు. అయితే ఇదే సమయంలో ఇంజినీరింగ్కు ప్రత్యామ్నాయంగా ఉన్న టెక్యేతర రంగాలైన బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, మీడియా, రిటైల్, కన్జూమర్ బిజినెస్, లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్కేర్, ఎనర్జీ రంగాల్లో డిమాండ్ ఏర్పడుతున్నదని, ఫ్రెషర్ల నియామకాలను పెంచుతున్నాయని అన్నారు. నేటి ప్రపంచంలో రోజురోజుకు వస్తున్న మార్పుల కారణంగా కంపెనీలు ఉద్యోగార్థుల నుంచి టాలెంట్తో పాటు కమ్యూనికేషన్, టీమ్ వర్క్, సాంకేతిక నైపుణ్యం వంటివి సాఫ్ట్ స్కిల్స్ను కూడా ఆశిస్తున్నాయని తెలిపారు. ఉద్యోగార్థులు నిరంతరం స్కిల్స్ నేర్చుకోవడంపై ఆసక్తి పెంచుకోవాలని, డాటా సైన్సెస్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి సాంకేతికతల నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొంటూ ఉండాలని సూచించారు.