Onion exports : శ్రీలంక దేశానికి పరిమిత పరిమాణంలో ఉల్లిగడ్డ ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఉల్లిగడ్డ ఎగుమతులకు అనుమతినిస్తూ కేంద్ర వాణిజ్య శాఖ.. ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT)’ ద్వారా నోటిఫికేషన్ జారీచేసింది. అదేవిధంగా యునైటెడ్ నేషన్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కు అదనంగా మరో 10 వేల టన్నుల ఉల్లి ఎగుమతికి కేంద్రం అంగీకారం తెలిపింది.
యూఏఈకి ఇప్పటికే 24 వేల టన్నుల ఉల్లిగడ్డ ఎగుమతికి కేంద్రం అనుమతించింది. తాజాగా మరో 10 వేల టన్నుల ఉల్లిగడ్డ ఎగుమతికి కేంద్రం ఆమోదం తెలుపడంతో భారత్ యూఏఈ నుంచి మొత్తం 34 వేల టన్నుల ఉల్లిగడ్డను దిగుమతి చేసుకుంది. అదేవిధంగా నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ (NCEL) ద్వారా శ్రీలంకకు 10 వేల టన్నుల ఉల్లి ఎగుమతి చేసేందుకు అనుమతులు మంజూరయ్యాయి.
ఇదిలావుంటే బంగ్లాదేశ్కు 50 వేల టన్నుల ఉల్లిగడ్డ ఎగుమతి చేసేందుకు భారత్ ఇప్పటికే అనుమతి తెలిపింది. వాస్తవానికి దేశంలో ఉల్లిగడ్డ కొరత లేకుండా చూసుకునేందుకు గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఎగుమతులపై నిషేధం విధించారు. ఇప్పుడు ఎగుమతులపై నిషేధం లేకపోయినా కేంద్ర ప్రభుత్వం అనుమతించిన దేశాలకు మాత్రమే ఎగుమతులు జరగనున్నాయి.
ఉల్లిగడ్డ కావాలని కోరిన దేశాలకు కేంద్రం మన దేశంలో లభ్యతను బట్టి ఎగుమతులకు ఓకే చెబుతోంది. కాగా కేంద్రం ఇప్పటికే వివిధ దేశాలకు ఉల్లి ఎగుమతులకు అనుమతి ఇవ్వడంతో దేశంలో ఉల్లిగడ్డ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదేగనక జరిగితే ఉల్లిగడ్డ ధరలు మరోసారి భారీగా పెరిగే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు.